తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వ్యవహారం ... దీనికి కేంద్రం అడ్డగించడం వంటివాటికి రీజన్ తాజాగా వెలుగు చూసింది. దీనిపై కేంద్రమే స్పందిం చింది. అయితే.. కేంద్రం చెప్పిన వివరణలో పూర్తిగా నర్మగర్భవ్యాఖ్యలు చేయడం గమనార్హం. కేంద్రం సీఎంల విదేశీ పర్యటనలకు అనుమతి ఇచ్చేప్పుడు.. అనేక విషయాలను పరిశీలిస్తుంది. దీనిలో రాజకీయ కోణం ఉంటే.. అప్పుడు నిరాకరిస్తుంది.
ఈ విషయాన్నే నర్మగర్భంగా పేర్కొన్న విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్.. కీలక వ్యాఖ్య లు చేశారు. ముఖ్యమంత్రుల పర్యటనకు సంబంధించి అనుమతి ఇచ్చే విషయంలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అదేవిధంగా వారి స్థాయి, వారు వెళ్తున్న పని, పాల్గొనే కార్యక్రమాలు, చేసే వ్యాఖ్యలు.. ఇలా అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తామని ఆయన తెలిపారు.
``ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి.. తన స్థాయికి తగని విధంగా కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. ఆ స్థాయి వ్యక్తులకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతి ఉండదు. అందుకే విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వలేదు.`` అని రణధీర్ జైశ్వాల్ తన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా.. ఈ వ్యవహారంపై బ్రిటన్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి విషయాన్నీ రాజకీయ కోణంలో చూడడం కేంద్రానికి పరిపాటిగా మారిందని వ్యాఖ్యానించారు.
రేవంత్ కార్యక్రమం ఏంటి?
రైజింగ్ తెలంగాణ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికా పర్యటనలకు ఈ నెల 16నే ప్రణాళిక వేసుకున్నారు. బ్రిటన్కు వెళ్లిపోయారు. అమెరికా విషయానికి వస్తే.. ఇక్కడ బోస్టన్, న్యూయార్క్ నగరాల్లో ఆయన పర్యటించాలి. హార్వర్డ్, ఎంఐటీ, నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో సమావేశాలు, ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్ణయించారు. దీనికి కూడా కేంద్రం అభ్యంతరం చెప్పలేదు. కాకనీ, కాంగ్రెస్ పార్టీ విదేశీ కార్యకర్తలతో సమావేశం ఉంది. దీనిని చూసిన తర్వాతే కేంద్రం అడ్డుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.