సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే, తన కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని సురేఖ చెప్పడంపై సీఎం రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా గుర్రుగా ఉంది. సురేఖ, సుస్మితలపై పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. సుస్మిత వ్యాఖ్యలను సురేఖ ఖండించాల్సింది పోయి తనకు సంబంధం లేదని చెప్పడం ఏంటి అని వారు ఫైర్ అవుతున్నారు.
ఈ వ్యవహారం నేపథ్యంలోనే సురేఖకు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో పలువురు నేతలు పావులు కదుపుతున్నారు. కేవలం నోటీసులిచ్చి వదిలేస్తే సరిపోదని, కఠిన చర్యలు తీసుకోవాలని హై కమాండ్ ను కోరుతున్నారు. అయితే, తాను క్రమశిక్షణ కమిటీకి చెప్పవలసింది చెప్పానని సురేఖ అన్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత అన్ని విషయాలపై స్పందిస్తానని అన్నారు. అప్పటివరకు మీడియా ముందు ఏమి మాట్లాడబోనని చెప్పారు.