రాజకీయ వ్యూహకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ పీకే.. బీహార్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. బంకీ పుర నియోజకవర్గానికి జరిగిన ఉప పోరులో ఆయన గెలుపు గుర్రం ఎక్కారు. తొలిసారి ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టిన పీకే.. ఘన విజయం దక్కించుకోవడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అది కూడా బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టి మరీ పీకే తొలి విక్టరీ చవి చూశారు.
2 దశాబ్దాలుగా బంకీపురా నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కు.వరుస విజయాలు అందించిన నియోజకవర్గం అది. ఆయన జాతీయాధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టడంతో బీజేపీ తరఫున నీరజ్ కుమార్ పోటీ చేశారు. పీకే చేతిలో ఆయన 18 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. దీంతో,జన్ సురాజ్ పార్టీ తరఫున అసెంబ్లీలో అడుగు పెట్టనున్న తొలి ఎమ్మెల్యేగా పీకే నిలిచారు.
ఉప ఎన్నికల ప్రచారంలో మాత్రం అలుపెరుగకుండా ప్రయత్నం చేసిన పీకేకు దక్కిన ఫలితం ఇది. ఇక, నితిన్ నబీన్తో పోలిస్తే.. బీజేపీ తరఫున ఇక్కడ నుంచి పోటీ చేసిన నీరజ్కుమార్కు ప్రజల్లో అంతగా ఫాలోయింగ్ లేకపోవడం కూడా పీకేకు కలిసి వచ్చింది. గత ఎన్నికల్లో 238 స్థానాల్లో జన్ సురాజ్ పోటీ చేయగా ఒక్క సీటు గెలవలేకపోయింది. ఆ సింపతీ కూడా పీకేకు వర్కవుటయింది. అయితే, బీహార్ లో బీజేపీ పతనం మొదలైందని, బీజేపీని 2014లో అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన పీకేని ఆ పతనానికి నాంది పలికారని జన్ సురాజ్ నేతలు అంటున్నారు.