పహల్గాం ఉగ్రదాడి.. పాక్ ఆర్మీ చీఫ్ రెచ్చగొట్టారా?

admin
Published by Admin — April 23, 2025 in Politics
News Image

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తోపాటు పలు దేశాల అధ్యక్షులు ఖండించారు. ఈ దాడి ఘటన వెనుక నిఘా వర్గాల వైఫల్యం ఉందని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపిస్తున్నారు. ‘హాట్ సమ్మర్’ పేరుతో కొద్దిరోజుల క్రితం నిఘా వర్గాలకు ఉగ్రదాడి జరిగే ఛాన్స్ ఉందని సమాచారం వచ్చిందని, కానీ ఈ ప్రాంతంలో దాడి జరిగే అవకాశం లేదని ఆ హెచ్చరికను లైట్ తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది.

మరోవైపు, ఈ నెల 17వ తారీఖున పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు కూడా దాడికి కారణమై ఉండవచ్చని పుకార్లు వస్తున్నాయి. తన ప్రసంగంలో జమ్మూ కాశ్మీర్ గురించి మునీర్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాశ్మీర్ పాకిస్తాన్ గొంతులో రక్తనాళంలా ఉండేదని, భవిష్యత్తులో కూడా ఉంటుందని మునీర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

భావితరాల వారు తమ పిల్లలకు పాకిస్తాన్ కథ చెప్పాలని, కశ్మీరీ సోదరుల పోరాటంలో వారిని ఒంటరిగా వదిలేయలేమని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. హిందువుల కంటే ముస్లింల జీవన విధానం అన్ని రకాలుగా భిన్నంగా ఉంటుందని, ధర్మం వేరని మునీర్ వ్యాఖ్యానించారు. మతాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆకాంక్షలు ఈ రెండు మతాలకు భిన్నంగా ఉంటాయని ఆయన చెప్పారు. ఈ రెండు దేశాల సిద్ధాంతానికి అవే పునాది అని కాబట్టి అవి రెండు దేశాలుగా విడిపోయాయి అని చెప్పారు.

దీంతోపాటు, ఉగ్రదాడి జరిగిన తర్వాత పాక్ వాయు సేనకు చెందిన నిఘా విమానాలు కరాచీ నుంచి లాహోర్, రావల్ పిండి బేస్ లకు తరలించడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక, 2019లో పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనంపై దాడి జరిగినప్పుడు కూడా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ గా మునీర్ వ్యవహరించారు. ఆయన కనుసనల్లోనే ఆ దాడి జరిగిందని అప్పట్లో పుకార్లు వచ్చాయి. ప్రస్తుతం పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కావడంతో ఈ దాడి వెనక కూడా ఆయన హస్తం ఉందా అన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

Recent Comments
Leave a Comment

Related News