ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ ఒకే ఒక్కడి హవా నడిచింది. రాజకీయంగా గుడివాడ అంటే కొడాలి నాని(Kodali Nani).. కొడాలి నాని అంటే గుడివాడ అన్నట్లుగా సీన్ ఉండేది. ప్రత్యర్థులు ఎంతమంది మారినా, ఎలాంటి వ్యూహాలు పన్నినా అక్కడ నాని కోటను బద్దలు కొట్టడం సాధ్యం కాలేదు. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. గత అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కొడాలి నాని విజయ పరంపరకు బ్రేకులు వేస్తూ కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము సంచలన విజయం సాధించారు. అప్పటివరకు నడిచిన వన్-మ్యాన్ షోకి ఎండ్ కార్డ్ వేస్తూ గుడివాడలో నయా రాజకీయ శకానికి తెరతీశారు.
అయితే సాధారణంగా ఎన్నికలు ముగిసి ప్రభుత్వం మారిన తర్వాత చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నిధుల కొరతతో ఇబ్బంది పడుతుంటారు. ప్రభుత్వ బడ్జెట్ విడుదలయ్యే వరకు రూపాయి పని కూడా ముందుకు సాగదు. కానీ గుడివాడ సరికొత్త ఎమ్మెల్యే వెనిగండ్ల రాము(Venigandla Ramu) మాత్రం ఈ పాత పద్ధతికి స్వస్తి పలికారు. గుడివాడ మట్టిలో పుట్టి, ఇక్కడే చదువుకుని నేడు విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలను, ఉన్నత ఉద్యోగులను ఆయన సంప్రదించారు. తమ సొంత ఊరి రుణం తీర్చుకోవాలంటూ వారిని మోటివేట్ చేసి పెద్ద ఎత్తున నిధులు సేకరించారు. దీనికి తోడు స్థానిక పారిశ్రామికవేత్తలను కూడా భాగస్వామ్యం చేస్తూ, నియోజకవర్గంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సమస్యలను సొంతంగా పరిష్కరించడం ప్రారంభించారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా డెవలప్మెంట్ పనులు స్పీడప్ చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఒకప్పుడు గుడివాడ(Gudivada) పేరు వింటే రాజకీయాలతో పాటు పేకాట క్లబ్బులు, కేసినోలు, కోడిపందాలు వంటి వివాదాస్పద అంశాలే ఎక్కువగా గుర్తొచ్చేవి. ఈ నెగెటివ్ ఇమేజ్ వల్ల నియోజకవర్గ అభివృద్ధి కూడా కుంటుపడింది. అయితే, గత రెండేళ్లుగా వెనిగండ్ల రాము తీసుకున్న ప్రత్యేక చొరవతో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే కాకుండా, మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ పెట్టారు. మార్కెట్ ఏరియా నుంచి ప్రధాన కూడళ్ల వరకు రోడ్లను సరికొత్తగా తీర్చిదిద్దారు. ఎన్నో ఏళ్లుగా అధ్వానంగా ఉన్న కీలకమైన కల్వర్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజల రవాణా కష్టాలను తీర్చారు. దీంతో గుడివాడ లుక్ ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో మారుతోంది.
గుడివాడలో గత రెండేళ్లుగా నిశ్శబ్దంగా సాగిన ఈ ప్రగతి విప్లవం ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. పూర్తయిన అనేక అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) శనివారం గుడివాడలో పర్యటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గుడివాడకు రావడం ఇదే తొలిసారి. సీఎం రాకతో నియోజకవర్గ తమ్ముళ్లలో కొత్త జోష్ నెలకొంది. అటు అభివృద్ధిలో దూసుకుపోతూ, ఇటు శాంతిభద్రతల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న గుడివాడ.. రాబోయే రోజుల్లో మోడల్ నియోజకవర్గంగా మారడం ఖాయమని స్థానికులు సైతం చర్చించుకుంటున్నారు. మొత్తానికి, కొడాలి నాని హవాకు బ్రేక్ పడటమే కాదు.. గుడివాడలో ప్రగతి సీన్ కూడా నెక్స్ట్ లెవెల్కు షిఫ్ట్ అయిందనేది వాస్తవం.