ఓ పక్క ఏపీ సీఎం చంద్రబాబు...మరో పక్క మంత్రి నారా లోకేశ్...ఇద్దరూ రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఏపీకి పెట్టుబడులు తేవడంతో పాటు పరిశ్రమల నిర్మాణాలు పూర్తి అయ్యేలా చొరవ తీసుకుంటూ పెట్టుబడిదారులకు ఈ ఇద్దరూ కొండంత భరోసానిస్తున్నారు. ఈ క్రమంలోనే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని 2028 జూలై 3 నాటికి పూర్తి చేస్తానని సీఎం చంద్రబాబు హామీ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం సీమవాసుల దశాబ్దాల కల అని లోకేశ్ అన్నారు. ఆ దిశగా చరిత్రాత్మక అడుగు పడిందని లోకేశ్ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేశామన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో సీమ రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు. విజయనగరంలో జేఎస్డబ్ల్యూ పారిశ్రామిక పార్కు పనులను కూడా ప్రారంభించామని తెలిపారు.
ఏపీని అభివృద్ధి పథంలో నిలపాలన్న కూటమి ప్రజా ప్రభుత్వ ఉక్కు సంకల్పానికి ఈ ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపనే నిదర్శనమని లోకేశ్ అన్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'తో రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి పథంలో నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు.