ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టమే. ముఖ్యంగా రాజధాని అంశం చుట్టూ తిరిగే రాజకీయం ఎప్పటికప్పుడు సరికొత్త రంగులు పులుముకుంటోంది. ఐదేళ్లపాటు మూడు రాజధానులే మా విధానం అని గట్టిగా వినిపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) స్వరం ఇప్పుడు మెల్లగా మారుతోందా? అమరావతిపై గతంలో ఉన్న దూకుడును తగ్గించి, కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చిందా? అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. నిన్నటివరకు అమరావతిని వ్యతిరేకించిన నేతలు, ఇప్పుడు మేము ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్తుండటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత అమరావతి ప్రాజెక్టుకు మళ్లీ పునర్జీవం వచ్చింది. కేంద్రం నుంచి అందుతున్న ఆర్థిక మద్దతు, చకచకా సాగుతున్న క్షేత్రస్థాయి పనుల నేపథ్యంలో.. ఇక అమరావతిని నిర్వీర్యం చేయడం సాధ్యం కాదనే స్పష్టత రాజకీయ వర్గాల్లో వచ్చేసింది. ఈ గ్రౌండ్ రియాలిటీని గమనించినందుకే జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) తన వ్యూహాన్ని మార్చారా అనే చర్చ మొదలైంది. అమరావతికి తాము శత్రువులం కాదనే ఇంప్రెషన్ను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా, భవిష్యత్తులో రాజకీయంగా నష్టపోకుండా ఉండేందుకే ఈ సరికొత్త ప్లాన్ను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఐదేళ్లపాటు ఒకే నినాదంతో సాగిన పార్టీ, ఇప్పుడు సడన్గా కొత్త సిద్ధాంతాలను తెరపైకి తేవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు విశ్లేషకులు. గతంలో తాము చేసిన విమర్శలు కేవలం అక్కడ జరుగుతున్న కొన్ని లోపాలను ఎత్తిచూపడానికే తప్ప, ప్రాంతీయ ప్రాధాన్యతను తగ్గించడానికి కాదనే కలరింగ్ ఇచ్చే ప్రయత్నం ఇప్పుడు కనిపిస్తోంది. అయితే ఈ మార్పును తటస్థ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది పక్కన పెడితే, ప్రత్యర్థులకు మాత్రం ఇది పెద్ద అస్త్రంగా మారింది. గతంలో అమరావతి(Amaravati) విషయంలో తీసుకున్న కఠిన వైఖరిని గుర్తు చేస్తూ, ఇప్పుడు చెప్తున్న మాటలను వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత సిద్ధాంతాలు ఉండవనేది అమరావతి విషయంలో వైసీపీ వైఖరి చూస్తే అర్థమవుతోంది. కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా సానుకూలత తెచ్చుకోవాలనే తపన ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ కొత్త ఫార్ములా ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తుంది? నాడు రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఈ మార్పును నమ్ముతారా? అనేది కాలమే తేల్చాలి. ఏదేమైనా, అమరావతిపై జగన్(Jagan) అండ్ టీమ్ తీసుకున్న ఈ యూ-టర్న్ ప్రస్తుతానికి ఏపీ పాలిటిక్స్లో ఆసక్తికరంగా మారింది.