విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కులం రంగు పులిమిన వైసీపీ నేతలు నానా యాగీ చేసిన సంగతి తెలిసిందే. ఇక, హోంమంత్రి వంగలపూడి అనిత మేకప్పై అవమానకరంగా మాట్లాడుతూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆ వ్యవహారాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు.
అటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు. మహిళల మేకప్ గురించి మాట్లాడటానికి గొడ్డలి పార్టీ వారికి సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. అంతేకాదు, పోలీసులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. అమరావతిలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య జరిగిన గొడవపై కూడా చంద్రబాబు స్పందించారు. అమరావతిపై కుట్ర చేసేందుకే వైసీపీ నేతలు అక్కడికి వెళ్లారని అన్నారు. అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునేందుకే రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
నిరంతరం కుట్రలు చేయడం గొడ్డలి పార్టీకి అలవాటేనని, బ్లేడ్, గంజాయి బ్యాచ్లు రాబందుల్లా వేచి ఉన్నాయని చెప్పారు. రాజకీయాలు చేసే అర్హత వైసీపీకి లేదని ధ్వజమెత్తారు. దేవాలయాలపై దాడులు చేసిన వాళ్లే ఇప్పుడు గుళ్లకు వెళ్లి నాటకాలు ఆడుతున్నాంటూ జగన్ పై మండిపడ్డారు. వైసీపీ నేతలవి పూర్తిగా క్రిమినల్ పాలిటిక్స్ అని, ఇలాంటి వ్యక్తులతో ఆడబిడ్డలకు, సమాజానికి రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారు చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బాగు చేయడానికి సుదీర్ఘ సమయం పడుతోందన్నారు.