ఎయిర్ పోర్టులోనే కీలక రివ్యూ పెట్టిన మోడీ

admin
Published by Admin — April 23, 2025 in Politics
News Image

గడిచిన కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్నకశ్మీర్ పై ఉగ్రదాడి జరగటం.. భారీ ఎత్తున సాగిన ఈ మారణకాండలో పలువురు విదేశీయులు.. స్వదేశీయులతో సహా మొత్తం 27 మంది మరణించిన వైనం పెను సంచలనంగా మారింది. ఈ ఉగ్రదాడిపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. భారత్ కు బాసటగా నిలుస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ మారణకాండపై ప్రదాని నరేంద్ర మోడీ చాలా సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు.

దాడి జరిగే సమయానికి సౌదీ అరేబియాలో ఉన్న ఆయన.. తన పర్యటనను అర్థాంతరంగా ముగించుకొని భారత్ కు వచ్చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధాని ఎంత సీరియస్ గా ఉన్నారన్న దానికి నిదర్శనంగా.. ఢిల్లీ ఎయిర్ పోర్టులో చోటు చేసుకున్న పరిణామాలే నిదర్శనంగా చెబుతున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో అడుగు పెట్టినంతనే.. అక్కడి లాబీల్లోనే అత్యవసర భద్రతా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్.. విదేశాంగ కార్యదర్శి విక్రమ మిస్త్రీతో అత్యవసర భేటీ నిర్వహించారు.

ఈ సందర్భంగా జరిగిన పరిణామాలపై కీలక సమాచారాన్ని ప్రధాని మోడీకి అందించినట్లుగా తెలుస్తోంది. ఈ దాడి నేపథ్యంలో దౌత్యపరమైన పరిణామాలపైనా లోతైన చర్చ జరగటంతో పాటు.. తీసుకోవాల్సిన చర్యలపై క్లియర్ గా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దాడి వెనుక ఉన్న వారిని వెను వెంటనే గుర్తించి..తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

ఈ దాడి ముందస్తు ప్రణాళికతోనే జరిగినట్లుగా అధికారులు అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రధానమంత్రి తక్షణ స్పందన.. దేశ ప్రజలకు భరోసా ఇచ్చేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు.. ఈ పరిణామం నేపథ్యంలో ప్రతిచర్య ఎంత కఠినంగా ఉండాలన్న దానిపై ప్లానింగ్ జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పరిణామాలు వెలుగు చూస్తాయన్న మాట బలంగా వినిపిస్తోంది.

 
Recent Comments
Leave a Comment

Related News