తెలంగాణ(Telangana)ను బొగ్గు గనుల వివాదం కుదిపేస్తోంది. సింగరేణి రికార్డుల్లో భద్రంగా ఉన్న 40 లక్షల టన్నుల బొగ్గు.. క్షేత్రస్థాయికి వెళ్లేసరికి మాయమైందన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కేంద్ర మైనింగ్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దీనిపై అధికారిక లేఖ రాయడంతో.. ఈ ఇష్యూ కాస్తా ఢిల్లీ వర్సెస్ గల్లీ స్థాయికి చేరింది. ప్రతిపక్షాలు దీనిని ప్రభుత్వ వైఫల్యంగా చూపిస్తుంటే, అసలు ఇంత భారీ మొత్తంలో బొగ్గు మాయమవ్వడం వెనుక ఉన్న తెరవెనుక సూత్రధారులు ఎవరనే చర్చ నడుస్తోంది.
నిజానికి, 40 లక్షల టన్నుల బొగ్గు అంటే అల్లాటప్పా విషయం కాదు. ఒక భారీ కొండను కరిగించేసినంత పని. ఈ స్థాయి బొగ్గును ఎవరికీ తెలియకుండా తరలించాలంటే సుమారు 2 లక్షల లారీలు రోడ్లెక్కి తిరగాలి, లేదా వేలాది గూడ్స్ రైళ్లు రేయింబవళ్లు నడవాలి. ప్రతి మైనింగ్ ఏరియాలో ఉండే నిఘా కెమెరాలు, ఆన్లైన్ జీఎస్టీ ఇన్వాయిస్లు, ప్రభుత్వ మైనింగ్ పర్మిట్లను దాటుకుని ఇదంతా జరగడం దాదాపు ఇంపాజిబుల్. పైగా, గనుల నుంచి వచ్చే ఈ థర్మల్ బొగ్గును విద్యుత్ ప్లాంట్లు, సిమెంట్ ఫ్యాక్టరీలు తప్ప సామాన్యులు ఎవరూ కొనలేరు. ఆయా సంస్థలన్నీ పక్కా అకౌంటింగ్, క్వాలిటీ చెక్ లేకుండా అసలు డీల్స్ చేయవు. కాబట్టి, రోడ్డు మార్గంలో బొగ్గు(Coal) దొంగతనం జరిగిందనడం కంటే సాంకేతిక, రికార్డుల లోపాలే ఇందులో ప్రధానంగా కనిపిస్తున్నాయి.
అలాగే మైనింగ్ రంగంలో ఒక చిన్న లాజిక్ ఉంది. బొగ్గును తవ్వినప్పుడు దాని పరిమాణాన్ని బట్టి లెక్కిస్తారు, కానీ రవాణా చేసేటప్పుడు బరువు చూస్తారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు నెలల తరబడి ఎండ వానలకు గురైనప్పుడు, అందులోని తేమ శాతం తగ్గి బరువులో భారీ వ్యత్యాసాలు రావడం సహజం. అయితే కేవలం ప్రకృతి కారణాల వల్లే ఇంత పెద్ద మొత్తంలో షార్టేజ్ రాదు. దీని వెనుక పాత రికార్డుల మాయాజాలం ఉందనే అనుమానాలు గట్టిగా ఉన్నాయి. గతంలో ఉత్పత్తి లక్ష్యాలను ఎక్కువగా చూపించుకోవడానికి కేవలం పేపర్లపైనే లెక్కలు పెంచి రాసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు నిజంగా స్టాక్ వెరిఫై చేసేసరికి ఆ కాగితపు బొగ్గు అదృశ్యమై, అసలు తప్పు బయటపడింది. ఏదేమైనా, ట్యాక్సులు కట్టినా భౌతికంగా బొగ్గు లేకపోవడం వెనుక సింగరేణి(Singareni) అంతర్గత అధికారుల తప్పుడు లెక్కల వ్యూహమే ప్రధాన కారణంలా కనిపిస్తోంది.