అమరావతిలో అభివృద్ధి పనుల దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA), అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం భారీ నివాస సముదాయాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.1,234.91 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రాజెక్ట్ వ్యయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే బడ్జెటరీ మద్దతు ద్వారా భరించనుంది.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (CPWD) చేపట్టనుంది. ఇప్పటికే ప్రీ-బిడ్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, టెండర్ పత్రాల రూపకల్పన ప్రక్రియ పురోగతిలో ఉందని కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా రాజధాని అమరావతిలో కేంద్రం చేపడుతున్న మొట్టమొదటి జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామడేషన్ (GPRA) ప్రాజెక్ట్ ఇదే కావడం గమనార్హం.
ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. నిర్మాణ దశలో ఏటా సుమారు 7 లక్షల పనిదినాలు, ప్రాజెక్టు పూర్తయ్యాక నిర్వహణ దశలో ఏటా 50,000 పనిదినాల ఉపాధి కలుగుతుందని కేంద్రం తెలిపింది.