మత్తు మందిచ్చి.. ఆపరేషన్లు చేయడం తెలిసిందే. కానీ, అప్పుడప్పుడు.. సినిమాలు చూపించి.. ఎలాంటి మత్తు ఇవ్వకుండా ఆపరేషన్లు చేస్తున్న ఘటనలు కూడా తెరమీదికి వస్తున్నాయి. అయితే.. ఇదిమన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకుజరగలేదు. ఎక్కడో ఉత్తరాదిలోనో.. మహారాష్ట్రలోనో అప్పుడప్పుడు చోటు చేసుకున్నాయి. కానీ.. తాజాగా పవన్ కల్యాణ్ సినిమా చూపించి.. ఏపీలో ఓ మహిళకు.. వైద్యులు ఆపరేషన్ చేశారు. ఇది సక్సెస్ అయి.. ఆమె సంతోషం కూడా వ్యక్తం చేయడం గమనార్హం.
ఎక్కడ.. ఎందుకు?
ఏపీలోని ఉమ్మడి ప్రకాశంజిల్లా, దర్శి నియోజకవర్గానికి చెందిన కోటేశ్వరమ్మ అనే 47 ఏళ్ల మహిళకు.. తీ వ్ర తలనొప్పి.. వెన్నునొప్పితో బాధపడుతున్నారు. పలు మార్లు వైద్యం చేయించుకున్నా.. ఆ సమస్య అలానే కొనసాగుతోంది. దీంతో వివిధ పరీక్షలు, స్కానింగ్ చేసిన అనంతరం.. ఆమె మెదడులో కణతి పేరుకుందని వైద్యులు గుర్తించారు. దీంతో కీలకమైన బ్రెయిన్ సర్జరీ చేయాలని నిర్ణయించారు.
అయితే.. సాధారణంగా ఇలాంటి ఆపరేషన్లు చేసేప్పుడు.. మత్తు ఇచ్చి చేస్తారు. కానీ.. కోటేశ్వరమ్మకు మత్తు పనిచేయలేదు. అధిక మోతాదు మత్తు ఇస్తే.. ప్రాణాలకే ప్రమాదమని గుర్తించిన వైద్యులు.. ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకున్నారు. ఆమె బ్రెయిన్ను ట్యూన్ చేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషించారు. ఈ క్రమంలో కోటేశ్వరమ్మకు పవన్ కల్యాణ్ అంటే.. ఇష్టమని, ఆయన సినిమాలంటే మరింత ప్రాణం పెడతారని తెలుసుకున్నారు. దీంతో ఆమెకు..పవన్ కల్యాణ్ సినిమా చూపించి.. ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు.
``చిన్న చికిత్స.. మీరు ఓజీ సినిమా చూడండి.. ఈలోగా అయిపోతుంది..`` అని కోటేశ్వరమ్మను ఒప్పించి న వైద్యులు.. ఆపరేషన్ థియేటర్లో ఓ ట్యాప్ టాప్ను ఏర్పాటు చేసి.. ఆమెను ఓ పక్కగా పడుకోపెట్టి.. సినిమా చూపించారు. అయితే.. సినిమ ప్రారంభంలోనే ఆమెకు ఆపరేషన్ చేయలేదు. ఆమె సినిమాలో లీనం అయ్యే క్షణం వరకు వేచి ఉన్నారు.
ఆమె పూర్తిగా ఓజీ సినిమా కథ, కథనంలో లీనమయ్యారని గుర్తించిన తర్వాత.. ఆపరేషన్ ప్రారంభించి.. చిటికెలో పూర్తి చేశారు. ఈ చికిత్స విజయవంతం అయిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కోటేశ్వరమ్మ ఆరోగ్యం స్థిరంగా ఉందన్నారు. కాగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా సినిమా చూపించి ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారని వైద్యులు చెప్పారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి తప్పవన్నారు.