రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల హడావిడి ప్రారంభమైన నాటి నుంచి పలువురు నాయకులు ఈ సీట్లు దక్కించుకునేందుకు ప్రయత్నించారు. మొత్తం నాలుగు స్థానాలకు సంబంధించి కూటమి పార్టీలు ఆయా సీట్లను పంచుకున్నాయి. వీటిలో మూడు స్థానాలు టీడీపీ(TDP)కి దక్కగా.. ఒక స్థానం జనసేనకు లభించింది. అయితే, ఎవరెవరిని పెద్ద సభకు పంపిస్తారు .. ఎవరిని సంతృప్తి పరుస్తారో అనే విషయాలపై పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. ఈ క్రమంలో టికెట్లు ఆశించిన వారు చివరి నిముషంవరకు తమ ప్రయత్నాలు సాగించారు.
నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 8 వరకు ఉండడంతో ఆరో తేదీ రాత్రి వరకు టీడీపీ తన అభ్యర్థులను ఖరారు చేయలేదు. దీంతో రాజ్యసభకు వెళ్లాలని ఆశిస్తున్న చాలామంది నాయకులు.. పార్టీలకు తమ తమ అభ్యర్థనలను పంపించారు. వీరిలో కర్నూలు జిల్లాకు చెందిన మాజీ పార్లమెంటు సభ్యులు టీజీ వెంకటేష్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు టీజీ భరత్(TG Bharath) చంద్రబాబు మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా భరత్ వ్యవహరిస్తున్నారు.
అయితే, ఇప్పుడు ఆయన తండ్రి మాజీ మంత్రి అయిన టీజీ వెంకటేష్(TG Venkatesh) రాజ్యసభ స్థానం దక్కించుకునేం దుకు ప్రయత్నాలు చేశారు. అంతేకాదు.. కొన్నాళ్ల కిందట అత్యంత రహస్యంగా ఆయన చంద్రబాబును కలుసుకున్నారని కూడా పార్టీ వర్గాల్లో గుసగుస వినిపించింది. ఆర్థికంగా బలంగా ఉండటం, కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ మంచి పరిచయాలు ఉన్న నేపథ్యంలో టీజీ వెంకటేష్ ఈ ప్రయత్నాలు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో కూడా ఆయన టిడిపి తరఫున రాజ్యసభలో అడుగుపెట్టిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా మౌనం గా ఉన్న టీజీ వెంకటేష్ రాజ్యసభ స్థానాల హడావుడి పెరగడంతో మరోసారి టిడిపి తరఫున రాజ్యసభ(Rajya Sabha)లో అడుగు పెట్టే దిశగా అడుగులు వేశారు. కానీ, ఇది ఫలించలేదు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన వెంకటేష్ పార్టీకి గతంలో బలంగానే పనిచేశారు. కానీ, మధ్యలో ఆయన కొన్నాళ్లు దూరంగా ఉన్నారు.
మళ్లీ టీడీపీలో చేరారు. ఇప్పుడు మరోసారి రాజ్యసభకు ప్రయత్నించారు. అయితే.. రాజ్యసభకు పోటీ ఎక్కువగా ఉండడంతో చంద్రబాబు టీజీ అభ్యర్థనను పక్కన పెట్టారని తెలుస్తోంది. ముఖ్యంగా యువతకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ దఫా సానా సతీష్(Sana Sathish), చింతకాయల విజయ్పాత్రుడులకు అవకాశం లభించింది. ఏదేమైనా.. టీజీ చివరి నిమిషం వరకు కూడా.. ప్రయత్నాలు చేసినట్టు పార్టీలో చర్చ నడుస్తోంది.