వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో కీలకంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని హైదరాబాద్ ఎయిర్పోర్టులో అరెస్టు చేసి అర్ధరాత్రి నుండి విచారణ చేస్తున్నారు. కసిరెడ్డి నుంచి ముఖ్యమైన సమాచారాన్ని రాబట్టేందుకు సిట్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.
లిక్కర్ స్కామ్ లో అనవసరంగా తన పేరును లాగుతున్నారని.. తనతో పెట్టుకుంటే మొత్తం బట్టలు విప్పిస్తా అంటూ సాయిరెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. `ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను.` అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
విజయసాయిరెడ్డి వార్నింగ్ తో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఆయన ఎవరెవరి పేర్లు బయటకు లాగుతారో అని లిక్కర్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి వైసీపీ నేతులు, కొందరు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాగా, మొదటి నుంచి లిక్కర్ స్కామ్లో కర్త, కర్మ, క్రియ అంతా కసిరెడ్డే అని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పటికే విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి సిట్ అధికారుల ఎదుట తన స్టేట్ మెంట్ ఇచ్చారు. మరోవైపు మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డి తో పాటు మరి కొంతమంది అధికారులను సిట్ విచారించింది.