ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో ఫైర్బ్రాండ్గా, గుడివాడ నియోజకవర్గానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన మాజీమంత్రి కొడాలి నాని సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా స్థానిక రాజకీయాలకు, నియోజకవర్గానికి ఆయన దూరంగా ఉంటుండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయిపోయిన నాని.. గుడివాడ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.
దశాబ్దాలుగా గుడివాడను తన గుప్పిట్లో ఉంచుకున్న కొడాలి నాని(Kodali Nani)కి గత ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. సొంత గడ్డపైనే ఓటమి ఎదురుకావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే తీవ్ర ఆవేదనతో నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అయితే నాని సైలెంట్ అవ్వడం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే చర్చ నడుస్తోంది.
నిజానికి గత ఎన్నికల సమయంలోనే తాను పోటీకి దూరంగా ఉంటానని కొడాలి నాని ప్రకటించారు. తన అన్న కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రమోట్ చేసేందుకు అప్పట్లోనే ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు గుడివాడ(Gudivada) బాధ్యతలను పూర్తిగా తన వారసుడికే అప్పగించి, తను మాత్రం నియోజకవర్గ పరిమితుల నుంచి బయటకు రావాలని నాని గట్టిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే రాబోయే ఎన్నికల్లో తాను గుడివాడ నుంచి పోటీ చేయనని, అయితే పార్టీ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని కొడాలి నాని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్పష్టం చేసినట్లు టాక్. అందుకు జగన్(Jagan) కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. త్వరలోనే కొడాలి నాని తన భవిష్యత్తు కార్యాచరణను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ షాకింగ్ డెసిషన్ గుడివాడ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.