దక్షిణాది కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన సమీకరణ తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పార్టీని బతికించేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్న వైఎస్ షర్మిల(YS Sharmila)ను పార్లమెంట్ లో అడుగుపెట్టించేందుకు ఢిల్లీ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. అయితే ఆమెను ఏపీ నుంచి కాకుండా, పక్కనే ఉన్న కర్ణాటక నుంచి పెద్దల సభకు పంపేందుకు తెరవెనుక కసరత్తు జరుగుతుండటం విశేషం. కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన ఏంటి? అసలు కన్నడ కోటా నుంచే షర్మిల పేరు ఎందుకు వినిపిస్తోంది? దీని వెనుక ఉన్న అసలు పొలిటికల్ లాజిక్స్ ఏంటో చూద్దాం.
షర్మిలకు కర్ణాటక(Karnataka) నుంచి రూట్ క్లియర్ కావడానికి ప్రధాన బలం.. అక్కడి అగ్రనేతలతో ఉన్న పాత బంధాలే. ముఖ్యంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు, వైఎస్ కుటుంబానికి మధ్య దశాబ్దాలుగా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంలో కూడా ఆయనే కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ బలంగా ఉండటం, అక్కడ మూడు సీట్లు గెలుచుకునే అవకాశం ఉండటంతో షర్మిలను అక్కడి నుంచే బరిలోకి దించాలనే యోచన సాగుతోంది. దీనివల్ల అటు ఏపీతో పాటు, ఇటు తెలంగాణలోని వైఎస్సార్ అభిమానులను కూడా కాంగ్రెస్ వైపు ఆకర్షించవచ్చనేది అధిష్టానం ప్లాన్.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైన తర్వాత, ప్రతిపక్ష స్థానం కోసం కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. సొంత అన్న, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఎదిరించి మరీ షర్మిల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ జెండాను మోస్తున్నారు. తీవ్రమైన ఒత్తిళ్లు, విమర్శలు ఎదురవుతున్నా ఆమె వెనకడుగు వేయకుండా పార్టీ వాయిస్ను వినిపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆమెకు పార్లమెంట్ స్థానాన్ని కల్పించడం ద్వారా, పార్టీ కోసం కష్టపడే వారికి ఢిల్లీ పెద్దలు ఇచ్చే రివార్డుగా ఇది నిలుస్తుంది. అలాగే, గతంలో విలీన సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు అవుతుంది. ఇది ఏపీలోని కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు.
కర్ణాటకకు ఉన్న మూడు సీట్లలో ఒకటి సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) వర్గానికి ఫిక్స్ అయినట్లు లీకులు వస్తున్నాయి. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం గట్టి పోటీ నడుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ జాతీయ మీడియా విభాగంలో యాక్టివ్గా ఉండే పవన్ ఖేడా వంటి పెద్ద నేతలు ఈ రేసులో ముందంజలో ఉన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు షర్మిల పట్ల సానుకూలత ఉన్నప్పటికీ, జాతీయ స్థాయి సమీకరణాల వల్ల ఆమెకు అవకాశాలు 30 శాతం మాత్రమే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మిగిలిన 70 శాతం జాతీయ నేతల వైపే మొగ్గు ఉన్నా.. ఒకవేళ సౌత్ సెంటిమెంట్కు ప్రాధాన్యత ఇస్తే మాత్రం షర్మిల పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. సీటు రావడం రాకపోవడం పక్కన పెడితే, ఏఐసీసీ పరిశీలనలో ఆమె పేరు ప్రముఖంగా వినిపించడం షర్మిల పొలిటికల్ మైలేజ్కు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.