దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలను చమురు కంపెనీలు మరోసారి పెంచాయి. అయితే.. ఇటీవల పెంచినట్టుగా పైసల్లో కాకుండా.. తాజాగా భారీ వడ్డనే చేశాయి. సోమవారం ఉదయాన్నే.. పెట్రోలుపై లీటరుకు 2 రూపాయల 84 పైసలు, డీజిల్పై లీటరుకు 2 రూపాయల 86 పైసల చొప్పున పెంచేశాయి. ఇది వరుసగా గత పదిరోజుల్లో మూడోసారి పెంచడం గమనార్హం. తాజా పెంపు సోమవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చేసింది.
దేశవ్యాప్తంగా పెరిగిన.. పెట్రోల్ ధరలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉన్నాయి. దీనికి కారణం.. ఆయా రాష్ట్రాలు విధిస్తున్న వ్యాట్. ఒక్కొక్క రాష్ట్రం పెట్రోలు... డీజిల్పై వ్యాట్ విధిస్తోంది. అలానే.. రోడ్డు సెస్సును కూడా విధిస్తున్నారు. ఏపీలో అయితే.. విద్యా సుంకం(జగన్ హయాంలో వేసిందే) కూడా ఉంది. దీంతో ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి ధరల్లో కొంత వ్యత్యాసం ఉంటుంది. అయినప్పటికీ.. మొత్తంగా పెట్రోల్పై లీటరుకు 2.84 రూపాయలు, డీజిల్పై 2.86 రూపాయల చొప్పున పెరిగింది.
ఎక్కడెక్కడ ఎంతెంత?
+ ఢిల్లీలో: పెట్రోలు రూ.102.12
+ ముంబయిలో రూ. 111.21
+ చెన్నైలో రూ. 107.77
+ విజయవాడలో: రూ.117.19
+ గుంటూరులో: రూ.117.59
+ హైదరాబాద్లో : రూ.115.58
ఏం చేస్తే తగ్గుతుంది?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు.. ఇరాన్-అమెరికా, ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ముడిచమురుకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ధరలు ఎగిసి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రాలే తమ వ్యాట్ను తగ్గించుకోవడం.. వినియోగం తగ్గించేలా ప్రజలను ప్రోత్సహించడం మినహా.. ప్రస్తుత పరిస్థితిలో మరో మార్గం కనిపించడం లేదని పరిశీలకులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాల్సి ఉంటుంది.