సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో.. ఏది రికార్డులను తిరగరాస్తుందో ఊహించడం ఎవరి తరం కాదు. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా అలాంటి ఒక ఊహించని సంచలనం నమోదైంది. రాజకీయాల్లో దేశంలోనే అత్యంత బలమైన డిజిటల్ నెట్వర్క్ కలిగిన భారతీయ జనతా పార్టీ (BJP) అధికారిక ఇన్స్టా పేజీకే ఒక ఊహాజనిత సెటైరికల్ పార్టీ షాకిచ్చింది. కేవలం నాలుగు రోజుల్లోనే కోటికి చేరువగా ఫాలోవర్లను సంపాదించుకుని, రూలింగ్ పార్టీ రికార్డులను బద్దలు కొట్టడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.
ఈ వినూత్న డిజిటల్ ఉద్యమానికి వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. దేశ అత్యున్నత న్యాయమూర్తి (CJI) కొందరు యువ విమర్శకులను ఉద్దేశించి 'కాక్రోచ్' (బొద్దింకలు) అని సంబోధించారనే వార్త నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యలపై డిజిటల్ స్ట్రాటజిస్ట్ అభిజీత్ దిప్కే విభిన్నంగా స్పందించారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవ పడకుండా, వ్యంగ్యమే ఆయుధంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) అనే ఒక నకిలీ రాజకీయ పార్టీ పేజీని ఇన్స్టాగ్రామ్లో ప్రారంభించారు.
ఈ సెటైరికల్ పేజీ నెటిజన్లను, ముఖ్యంగా యువతను విపరీతంగా ఆకట్టుకుంది. తామంతా ఆ బొద్దింకల పార్టీలోనే చేరతామంటూ నెటిజన్లు క్యూ కట్టారు. దీంతో కేవలం 4 రోజుల్లోనే ఈ పేజీ ఏకంగా 92 లక్షల (9.2 M) ఫాలోవర్లను సొంతం చేసుకుంది. దేశంలోనే అత్యధిక డిజిటల్ ఫాలోయింగ్ ఉన్న అధికార బీజేపీ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీ (8.7 M ఫాలోవర్లు) రికార్డును కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ(Cockroach Janta Party) చాలా సులువుగా దాటేయడం గమనార్హం.
సాధారణంగా ఏదైనా నచ్చకపోతే ట్రోల్స్ చేయడం, హ్యాష్ట్యాగ్లు వాడటం మనం చూస్తుంటాం. కానీ, ఒక వ్యవస్థపై తమ అసంతృప్తిని తెలపడానికి యువత ఎంచుకున్న ఈ సరికొత్త పంథా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక చిన్న వ్యంగ్య ఆలోచన, దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ డిజిటల్ రికార్డులను సైతం వెనక్కి నెట్టేసే స్థాయికి చేరడం.. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా(Social Media) పవర్ ఏంటో మరోసారి నిరూపించింది. ప్రస్తుతం ఇన్స్టా వేదికగా ఈ బొద్దింకల పార్టీహవా నడుస్తోంది.