తమిళనాడు రాజకీయాలలో కొత్త చాప్టర్ మొదలైంది. నవతరం రాజకీయాలకు నాంది పలుకుతూ కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ ఈరోజు తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సినీఫక్కీలో విజయ్ డైలాగ్ చెప్పగానే చెన్నైలోని నెహ్రూ స్టేడియం మొత్తం కేరింతలు, ఈలలు, అరుపులతో మార్మోగిపోయింది. తమ అభిమాన నటుడు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తుండడంతో వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు చెన్నైలోని నెహ్రూ స్టేడియానికి చేరుకున్నారు. స్టేడియం బయట ఇంకా భారీ సంఖ్యలో విజయ్ అభిమానులు ఉన్నారు.
గవర్నర్ ఆర్లేకర్ చేతుల మీదుగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సినీ నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వాస్తవానికి విజయ్ తో పాటు ఈ రోజు ఇద్దరు కాంగ్రెస్, ఏడుగురు టీవీకే ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. కానీ మొత్తం 9 మంది టీవీకే ఎమ్మెల్యేలే ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏదేమైనా రెండు రోజులు వాయిదా తరువాత పొలిటికల్ థ్రిల్లర్ ను తలపించేలా జరిగిన నాటకీయ పరిణామాల అనంతరం ఎట్టకేలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ఆయన అభిమానులు టీవీకే కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం విజయ్ తొలిసారి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ప్రజా ప్రభుత్వంతో నవశకం ప్రారంభమైందని భావోద్వేగంతో మాట్లాడారు. తమిళనాడు రూ. 10 లక్షల కోట్ల అప్పులో ఉందని, హామీల అమలుకు కొంత సమయం ఇవ్వాలని విజయ్ కోరారు. మహిళల భద్రత, డ్రగ్ ఫ్రీ సొసైటీ, అవినీతి లేని పారదర్శక పాలన, కనీస సౌకర్యాల కల్పన తన ప్రాధాన్యతలని అన్నారు. విద్యార్థులకు విజయ్ మామ అండగా ఉంటాడని హామీ ఇచ్చారు.