ఇతర విషయాల్లో ఎలా ఉన్నా.. తాజాగా కేంద్రం తీసుకువచ్చిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు(మహిళా రిజర్వేషన్)పై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీలు భారీ ఐక్యతను ప్రదర్శించాయి. ఈ కూటమిలోని అన్ని పక్షాలు కూడా మోడీ(modi) ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్ట సవరణ బిల్లును ఏకగ్రీవంగా వ్యతిరేకించాయి. సభలో చర్చల సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలం అని చెప్పినా.. ఓటింగ్ విషయానికి వచ్చే సరికి అన్ని పార్టీలూ ఏకతాటిపై నిలిచాయి. ఫలితంగా.. లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఈ విషయాన్ని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించి.. సభను వాయిదావేశారు.
ఏం జరిగింది?
వాస్తవానికి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 99 మంది ఎంపీలు మాత్రమే గెలిచారు. ఇతర మిత్రపక్షాలతో కలుపుకొంటే.. ఈ సంఖ్యా బలం 234. తాజాగా జరిగిన ఓటింగ్లో మిత్ర పక్షాలను సభకు రప్పించడంలో రాహుల్గాంధీ విజయ వంతంఅయ్యారు. అంతేకాదు.. వారిని ఏకతాటిపై నడిపించారు. ఫలితగా.. లోక్సభలో శుక్రవారం రాత్రి జరిగిన ఓటింగ్లో 230 మంది ఇండియా కూటమి సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. మొత్తం 234 మంది సభ్యులు కాగా.. నలుగురు గైర్హాజరయ్యారు. ఇది కూటమి ఐక్యతను ప్రతిబింబించింది.
రాజ్యాంగ ఆక్రమణను అడ్డుకున్నాం..
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందిస్తూ.. మోడీ సర్కారు రాజ్యాంగ ఆక్రమణను అడ్డుకున్నామని వ్యాఖ్యానించారు. తాము మహిళా బిల్లుకు, మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి వ్యతిరేకం కాదన్నారు. తామే తొలుత ఈబిల్లును తీసుకువచ్చామని గుర్తు చేశారు. అప్పట్లో రాజ్యసభలోనూ దీనిని ఆమోదించుకున్నామని పేర్కొన్నారు. 2023లో బిల్లు పెట్టినప్పుడు ఆమోదించామని.. అప్పట్లో చట్టం కూడా అయిందని తెలిపారు.
ఆ చట్టాన్ని యథాతథంగా అమలు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రాహుల్ గాంధీ తెలిపారు. కానీ.. ఈ బిల్లుకు.. డీలిమిటేషన్(నియోజకవర్గాల పునర్విభజన)కు లింకు పెట్టడం అంటే.. రాజ్యాంగంలోకి చొచ్చుకుపోవడమేనని పేర్కొన్నారు. అందుకే..దీనిని తాము వ్యతిరేకించామని.. మోడీసర్కారు రాజ్యాంగాన్ని అవమానించే చర్యలను ఇప్పుడే కాదు.. ఎప్పటికీ అడ్డుకుంటామని చెప్పారు. డీలిమిటేషన్కు.. మహిళల రిజర్వేషన్కు ముడిపెట్టరాదన్నదే తమ ఉద్దేశమని ఆయన తేల్చి చెప్పారు.