ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తన పొలిటికల్ అడ్రస్ను మార్చబోతున్నారా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత తాడేపల్లి, బెంగళూరుల మధ్యే తిరుగుతున్న జగన్, ఇప్పుడు తన పాత కోట లోటస్ పాండ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంమే ఆలస్యం పార్టీ క్యాడర్లో కొత్త జోష్ నెలకొంది.
జగన్ రాజకీయ ప్రస్థానంలో ‘లోటస్ పాండ్’(Lotus Pond)కు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. పార్టీ ఆవిర్భావం నుండి 2019లో అఖండ విజయం సాధించే ముందు వరకు, ఆయన ప్రతి వ్యూహం అక్కడి నుంచే రూపుదిద్దుకుంది. 2017లో చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు సైతం ఆ నివాసమే కేంద్ర బిందువు. ఇప్పుడు పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉన్న సమయంలో, మళ్లీ అదే సెంటిమెంట్ కలిసి వస్తుందని, లోటస్ పాండ్ నుంచే పోరాటం ప్రారంభిస్తే పూర్వ వైభవం వస్తుందని కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు.
దీనికి తోడు గత కొంతకాలంగా ప్రత్యర్థులు జగన్పై చేస్తున్న ప్రధాన విమర్శ బెంగళూరు పర్యటనలు. రాష్ట్రంలో సమస్యలు ఉన్నప్పుడు ఆయన పొరుగు రాష్ట్రంలో ఉంటున్నారంటూ కూటమి నేతలు చేస్తున్న విమర్శలు పార్టీ క్యాడర్ను ఇరకాటంలో పడేస్తున్నాయి. ఇప్పుడు మకాంను హైదరాబాద్కు మార్చడం ద్వారా ఆ విమర్శలకు అడ్డుకట్ట వేయవచ్చని వైసీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. హైదరాబాద్లో ఉంటే ఏపీ(AP)లోని అన్ని ప్రాంతాల నేతలకు, కార్యకర్తలకు జగన్ను కలవడం సులభతరమవుతుంది.
తాడేపల్లి నివాసంతో పోలిస్తే హైదరాబాద్(Hyderabad)లో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం జగన్కు కొంత వెసులుబాటుగా కూడా ఉంటుంది. తాడేపల్లిలో ఉండే భద్రతా ఆంక్షలు, నిఘా నీడలు కార్యకర్తలను జగన్కు దూరం చేస్తున్నాయనే టాక్ ఉంది. అందుకే, ఎలాంటి నియంత్రణలు లేని లోటస్ పాండ్లో ప్రజా దర్బార్ తరహాలో నేతలను కలిసేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం.