ఏపీలో గడిచిన కొద్ది రోజులుగా రాజకీయాలు తీవ్ర సంచలనగా మారుతున్నాయి. గతంలో ఎప్పుడో జరిగిన అంశాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. మంత్రి అచ్చం నాయుడు(Atchannaidu) చేసిన వ్యాఖ్యలు మొదలు వరుసగా ఇప్పటివరకు నలుగురు మంత్రులు మీడియా ముందుకు రావడం.. వైసిపిని టార్గెట్ చేస్తూ గత రాజకీయాలను ప్రస్తావించడం వంటివి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న రాజకీయాలే వేడిగా సాగుతున్నాయని అందరూ అనుకుంటుంటే ఇప్పుడు 2010 -12 మధ్య జరిగిన అంశాలు తెర మీదకు తీసుకురావడం గమనార్హం.
అప్పట్లో ఆ నాయకులు ఇలా అన్నారు. ఈ నాయకులు ఇలా అన్నారని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీనికి కౌంటర్గా వైసిపి(YCP) కూడా గతాన్ని తొవ్వితీస్తోంది. 1995- 97 మధ్య రాష్ట్రంలో ఏం జరిగింది? టిడిపిలో ఏం జరిగింది? ఆ తర్వాత కాలంలో దివంగత ఎన్టీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూలు మీడియా ముందు చేసిన వ్యాఖ్యలను వైసిపి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. ఇలా ఇరుపక్షాలు గతంలో ఏం జరిగాయి అన్న రాజకీయాలను సోషల్ మీడియాలో పెట్టడంతో పాటు ఇది ప్రధాన ప్రెస్ మీట్లలో కూడా ప్రస్తావిస్తున్నారు.
దీనివల్ల ఇటు ప్రజలకు వచ్చిన లాభం ఏమీ కనిపించడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం సమస్యలు ఉన్నాయి. అదే సమయంలో అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయి. వాటిపై దృష్టి పెట్టి వాటిని పరిష్కరించే దిశగా ఇటు ప్రభుత్వం, ప్రజల తరఫున మాట్లాడేందుకు ప్రతిపక్షంగా వైసిపి ప్రయత్నిస్తే ఎంతో కొంత ప్రజలకు మేలు జరుగుతుంది తప్ప ఈ తరహా గతించిన రాజకీయాలను మాట్లాడుకుని ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం వల్ల ఇప్పటికిప్పుడు వచ్చే లాభం కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికల కాని లేవన్నది పరిశీలకులు చెబుతున్న మాట.
ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్రంలో ఆసక్తిగా మారింది. మరి ఇది ఏ మేరకు ఇరుపార్టీలకు మేలు చేస్తున్నది చూడాలి. ప్రజలు అయితే దీన్ని పట్టించుకోవడం లేదు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా నాయకులు మాట్లాడుతారు. అది సహజం. ఒక పార్టీలో ఉండి మరో పార్టీకి అనుకూలంగా ఎవరూ మాట్లాడరు. కాబట్టి గతంలో బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana), ధర్మాన ప్రసాదరావు అయినా జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడి ఉండవచ్చు,
అంతమాత్రాన వారి అభిప్రాయాలను మార్చుకోకూడదని ఏమీ లేదు, అదే సమయంలో ఇటు టీడీపీ(TDP) లోను గతంలో విమర్శించిన వారు ఉన్నారు, చంద్రబాబును దూషించిన వారు కూడా ఉన్నారు, ఇవన్నీ రాజకీయాల్లో కామన్ గా జరుగుతూ ఉంటాయి. వీటిని ఇప్పుడు తొవ్వే తీయడం వల్ల ప్రయోజనం ఏంటి అన్నది వైసిపి, టిడిపి కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రజల కోసం పనిచేస్తే ఇరు పార్టీలకు ప్రయోజనం ఉంటుంది.