ప్రధాన మంత్రినరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్ లెటర్ రాశారు. ఈ నెల 16-18 మధ్య మూడు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక భేటీపై ఆయన పలు సూచనలు చేశారు. ఈ భేటీలో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేసన్ అంశాలపై చర్చించి.. నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో రాష్ట్రాలతోనూ కేంద్రం చర్చించాలని.. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే.. అది తెలంగాణ వంటి జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలకు భారీ నష్టం చేకూరుస్తుందని సీఎం పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
మహిళా రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహకారం అందిస్తుందని సీఎం రేవంత్ చెప్పారు. వాస్తవానికి తామే ఈబిల్లును మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో తీసుకు వచ్చామన్నారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ను తీసుకు రావడం అంటే.. బాగా ఆలస్యం చేయడమేనని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తాము మద్దతు ఇస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల నుంచే దీనిని అమలు చేయాలని ఆయన సూచించారు. ఇక, నియోజకవర్గాల పునర్విభజన విషయంపై మాత్రం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.
జనాభా ప్రాతిపదికన కాకుండా.. రాష్ట్రాల తలసరి ఆదాయం(జీఎస్డీపీ) ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కోరుతున్నారు. ప్రస్తుత పార్లమెంటు స్థానాలు 543 ఉన్నాయని.. డీలిమిటేషన్ తర్వాత.. 50 శాతం మేరకు పెరిగితే .. 800 పైచిలుకు నియోజవర్గాలు వస్తాయని.. అయితే.. వీటిలో సగం నియోజకవర్గాలను జీఎస్డీపీ ఆధారంగా విభజన చేయాలని సూచించారు. అలా చేయకపోతే.. నష్టపోతామన్నారు. గతంలో కేంద్రం ఆదేశాలు, సూచనల మేరకు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుముఖం పట్టిందన్నారు.
దీనిని దృష్టిలో ఉంచుకుని డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలని సూచించారు. ఏదేమైనా ఈ విషయంలో రాష్ట్రాలు, రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోవాలన్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే.. సరికాదని ఆక్షేపించారు. ఈ మేరకు ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం లేఖ రాశారు. కాగా.. ఈ నెల 16-18 మధ్య పార్లమెంటు ఉభయ సభలు భేటీ కానున్నాయి. ఈ భేటీలో రెండు కీలక బిల్లులను ఆమోదించనున్నాయి.