నార్త్ అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రతినిధిగా జనసేన ఐటీ చైర్మన్ మిరియాల శ్రీనివాస్ కొద్ది రోజుల క్రితం నియమితులయ్యారు. ఆర్థిక సంబంధాలు, మానవ సమస్యలను పరిష్కరించేంందుకు టెక్నాలజీ, ఏఐ అత్యంత శక్తివంతమైన సాధనాలు అని మిరియాల శ్రీనివాస్ నమ్ముతారు. కాబట్టే, ఏపీ ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తానని నమ్మకంతో మిరియాల శ్రీనివాస్ చెబుతున్నారు.
నార్త్ అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రతినిధిగా తనకంటే ముందు నియమితులైన జయరాం కోమటి అనుభవం తనకు స్ఫూర్తిదాయకమన్నారు. ఏపీ ఎన్ఆర్టీ ఛైర్మన్ రవి వేమూరి మార్గదర్శకత్వం తనకు ఆదర్శప్రాయమన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఎన్నారైల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్ఆర్ఐ నేతృత్వంలోని స్టార్టప్ లు, ఇన్వెస్ట్మెంట్ ఫండ్లను స్థానిక అవకాశాలతో అనుసంధానం చేయడం ముఖ్యమని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైల పెట్టుబడులనే కాకుండా వారి వృత్తి నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటానని అన్నారు. “బే ఏరియా నుండి బెంగళూరుకు ఉద్యోగాలు మార్చగలిగినప్పుడు తాను పుట్టిన బందరకు ఎందుకు మార్చలేము” అన్న ప్రశ్న తనను ఈ స్థాయికి చేర్చిందని చెప్పారు.
కెరీర్:
యూనివర్సిటీ ఆఫ్ డల్లాస్, USA నుంచి MBA చేశారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అట్ ఆర్లింగ్టన్, USA నుంచి MS ఇంజనీరింగ్ చేశారు. మిరియాల శ్రీనివాస్ 30 సంవత్సరాలకు పైగా వైర్లెస్ మరియు ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ రంగంలో అనుభవం కలిగిన సీనియర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్. జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో విస్తృతమైన అనుభం ఆయన సొంతం. వ్యాపారం, సాంకేతిక రంగాలలో నైపుణ్యం కలిగిన శ్రీనివాస్ కొత్త ఉత్పత్తులు, సాంకేతికతలు మరియు సేవలను గుర్తించడంలో దిట్ట.
టెక్నికల్ కెరీర్:
ఐటీ ఆపరేషన్స్ కోసం ఎంటర్ప్రైజ్-గ్రేడ్ AI ప్లాట్ఫామ్ అభివృద్ధి చేసిన కోర్ టీమ్ సభ్యుడిగా ఆయన గుర్తింపు పొందారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్పత్తులను లాంచ్ చేసి, డెలివరీ టీమ్ లను నిర్మించడం ఆయన ప్రత్యేకత. డైరెక్ట్-టు-కన్స్యూమర్ కంటెంట్ సేవల వ్యాపారాన్ని ప్రారంభించి విజయవంతంగా నడిపారు.
ప్రాంతీయ స్థాయిలో ఎంటర్ప్రైజ్ మరియు WiMAX స్ట్రాటజీ రూపొందించారు. ప్రొడక్ట్ మేనేజర్గా ఫీచర్ సెట్ లాక్-డౌన్ నిర్వహించి సుమారు $20 మిలియన్ ఆదాయం పొందారు. సెల్యులర్-ఎంటర్ప్రైజ్ కన్వర్జెన్స్ సొల్యూషన్ అభివృద్ధి చేశారు. 3GPP వైర్లెస్ స్టాండర్డ్స్ కు సహకరించారు. 3 అమెరికన్ పేటెంట్లు పొందారు. మరో 3 అదనపు పేటెంట్లు సమీక్షలో ఉన్నాయి. టెక్నాలజీకి సంబంధించిన అనేక బ్లాగులు రచించారు.
రాజకీయాలు:
2017/2018 నుంచి జనసేన పార్టీతో కలిసి మిరియాల శ్రీనివాస్ పని చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ మరియు సాంకేతిక సేవలు అందిస్తున్నారు. 2020లో జనసేన ఐటీ సెల్ చైర్మన్ గా నియమితులయ్యారు. వెబ్సైట్, అప్లికేషన్లు, డొనేషన్ సేవలు, సభ్యత్వం, పిటిషన్లు, IVR/OBD మరియు SMS ఇంటిగ్రేషన్ల కోసం అంతర్గత టీమ్ను నియమించి సమర్థవంతంగా నిర్వహించారు. రాష్ట్ర, జిల్లా మరియు అసెంబ్లీ స్థాయిలలో IT కోఆర్డినేటర్ల టీమ్ను నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా IT సపోర్టర్లను గుర్తించడానికి క్యాంపెయిన్లు నడిపి 30 వేల మందికి పైగా సపోర్టర్ల డేటాబేస్ సేకరించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, జనవాణి, కొత్త ఓటర్ల నమోదు ప్రచారాలకు మద్దతునిచ్చారు. IVR మరియు వాట్సాప్ క్యాంపెయిన్లు రూపొందించారు. ఈ క్రమంలోనే మిరియాల శ్రీనివాస్ సేవలకు గుర్తింపుగా ఆయనను నార్త్ అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు.