అమరావతి(Amaravathi) రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వేసిన మాస్టర్ ప్లాన్ అట్టర్ ప్లాప్ అయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇరుక్కించాలని ఆయన చేసిన ప్రయత్నాలన్నీ హైకోర్టు సాక్షిగా నీరుగారిపోయాయి. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు కీలక పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేయడంతో ఆర్కేకు కోలుకోలేని షాక్ తగిలింది.
గత కొంతకాలంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసును అస్త్రంగా చేసుకుని చంద్రబాబుపై న్యాయపోరాటం చేస్తున్న ఆర్కేకు సోమవారం హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసు దర్యాప్తును రాష్ట్ర విచారణ సంస్థల నుంచి తప్పించి సీబీఐకి అప్పగించాలని ఆయన కోరారు. అయితే, ఈ అభ్యర్థనలో ఎలాంటి బలం లేదని కోర్టు తేల్చిచెప్పింది. సీబీఐ(CBI) విచారణ కోరడం ద్వారా చంద్రబాబును మరింత ఇబ్బంది పెట్టాలని చూసిన ఆర్కే వ్యూహం ఇక్కడ మొదటి దెబ్బ తింది.
అంతటితో ఆగకుండా, చంద్రబాబు(Chandhrababu)కు గతంలో లభించిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఆర్కే మరో పిటిషన్ వేశారు. ఒకవైపు ప్రభుత్వం మారుతున్న తరుణంలో, ఈ పిటిషన్ ద్వారా రాజకీయ ప్రకంపనలు సృష్టించాలని ఆయన ఆశించినట్లు కనిపిస్తోంది. కానీ, న్యాయస్థానం ఈ అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. నిబంధనల ప్రకారం చంద్రబాబుకు వచ్చిన బెయిల్ సబబేనని పరోక్షంగా స్పష్టం చేస్తూ, ఆర్కే ఆశలపై కోర్టు నీళ్లు చల్లింది.
ఇక ఏసీబీ కోర్టులో నడుస్తున్న ఈ కేసు విచారణను ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలన్న ఆర్కే మూడో వినతి కూడా వీగిపోయింది. అసలు ఈ మూడు పిటిషన్లకు ప్రాథమికంగా విచారణార్హత లేదని హైకోర్టు(High Court) కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడం గమనార్హం. అంటే, ఆర్కే దాఖలు చేసిన పిటిషన్లలో కనీస స్థాయి న్యాయపరమైన పస లేదని న్యాయమూర్తులు స్పష్టం చేసినట్లయింది.
రాజకీయంగా చంద్రబాబును ఢీకొట్టేందుకు ఆర్కే(RK) ఎంచుకున్న ఈ న్యాయపోరాటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పిటిషన్లు వేయడం ద్వారా మైలేజ్ పొందాలని చూసినా, చివరకు న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఆయన రక్షణలో పడాల్సి వచ్చింది. చెప్పేవన్నీ అబద్ధాలు.. వేసేవన్నీ తప్పుడు కేసులు అంటూ టీడీపీ శ్రేణులు ఇప్పుడు ఆర్కేపై సోషల్ మీడియా వేదికగా సెటైర్ల వర్షం కురిపిస్తున్నాయి. మొత్తానికి రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును చుట్టుముట్టాలని చూసిన ఆర్కే, తానే కోర్టు తీర్పుతో రింగులో చిక్కుకున్నట్లయింది.