ఈ మధ్యన ఏపీ రాజధాని అమరావతి(amaravati)లో చోటు చేసుకున్న రెండు భారీ అగ్ని ప్రమాదాల(fire accident) గురించి తెలిసిందే. భారీ ఎత్తున ఆస్తినష్టానికి కారణం కావటంతో పాటు.. భద్రతా పరమైన అంశాలపై చర్చ మొదలైంది. ఇంతకూ ఈ రెండు అగ్నిప్రమాదాల్లో ఒకదాని వెనుకున్న అసలు కారణం వెలుగు చూసింది. విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. షాక్ కు గురయ్యే ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అమరావతిలోని రాయపూడి సమీపంలో మేఘా ఇంజినీరింగ్ క్యాంపులో పైపులు తగలబడిన ఉదంతం వెనుక ఉన్న గుట్టు రట్టైంది.
సెలవు అడిగినా ఇవ్వలేదని సూపర్ వైజర్ మీద కోసంతో సదరు సెక్యూరిటీ గార్డు నిప్పు పెట్టినట్లుగా గుర్తించారు. అయితే.. మంటలు ఒక స్థాయికి వెళ్లిన తర్వాత ఆర్పేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఏదైనా సంఘటన జరిగితే.. అదనపు సిబ్బందిని నియమిస్తారన్న ఉద్దేశంతోనే నిప్పు పెట్టినట్లుగా గుర్తించారు. ఆ తర్వాత మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
మూడు రోజులుగా వివిధ కోణాల్లో విచారించిన తర్వాత సెక్యూరిటీ గార్డు రామునే ఈ పని చేసినట్లుగా పోలీసులు నిర్దరణకు వచ్చారు. రాయపూడి సమీపంలో మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన పైపులు.. ఇతర సామాగ్రిని నిల్వ చేసింది.దీనికి సెక్యూరిటీ గార్డుగా రాము అనే వ్యక్తిని నియమించారు. ఈ అగ్నిప్రమాదానికి రెండు రోజుల ముందు.. తమ బంధువు మరణించాడని.. సెలవు కావాలని అడిగితే.. సూపర్ వైజర్ ఇవ్వలేదు. అదే సమయంలో డ్యూటీకి సంబంధించిన అంశం మీదా సూపర్ వైజర్, రాము మధ్య మరోసారి వాదన చోటు చేసుకుంది.
ఉదయం డ్యూటీ చేసిన తర్వాత, రాత్రి కూడా డ్యూటీ చేయాలని చెప్పటంతో అక్కడున్న సెక్యూరిటీ గార్డుతో గొడవ పడ్డాడు. జనరేటర్ లోని డీజిల్ ను ఒక సీసా నిండా నింపుకొని దగ్గర పెట్టుకున్న అతను.. రాత్రి తొమ్మిదిన్నర గంటల పరాంతంలో విధుల్లో భాగంగా రౌండ్స్ తిరుగుతూ..డీజిల్, ఎండుగడ్డితో పైపులకు నిప్పు పెట్టాడు.
పైపులు కొంత కాలిన తర్వాత ఆర్పేస్తే.. భద్రత కోసం మరింత మందిని సిబ్బందిని పెట్టుకుంటారన్న ఉద్దేశంతో చేసినప్పటికి.. మంటల తీవ్రత అమాంతం పెరగటం.. తాను అనుకున్నది సాధ్యం కాక.. పెద్ద ఎత్తున అగ్నిప్రమాదానికి కారణమైంది.పోలీసుల విచారణలో సెక్యూరిటీ గార్డుగా ఉన్న రాము తీరుపైనా.. మాటలపైనా అనుమానం వచ్చిన పోలీసులు మరింత లోతుగా విచారించగా.. అసలు విషయం వెలుగు చూసింది.