ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కబురు వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల విభజన వేళ.. రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ(assembly seats) స్థానాల పెంపు హామీ గురించి తెలిసిందే. అదే సమయంలో లోక్ సభ స్థానాల(delimitation) సంఖ్యను పెంచాలన్న వాదన గడిచిన కొంతకాలంగా బలంగా వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. కేంద్రంలోని మోడీ సర్కరు అన్నిరాష్ట్రాల్లో అసెంబ్లీ.. లోక్ సభ స్థానాల్ని పెంచేందుకు వీలుగా కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టేందుకు మోడీ సర్కారు సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు.
తాజాగా పెంచాలనుకుంటున్న నియోజకవర్గాలతో లోక్ సభలో ఇప్పటివరకు ఉన్న 543 స్థానాల నుంచి 816 స్థానాలకు పెరుగుతాయని చెబుతున్నారు. అదే విధంగా ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా ఉన్న 4123 అసెంబ్లీ స్థానాలు కాస్తా 6185 చొప్పున పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరిగే అసెంబ్లీ స్థానాలు ఎన్ని? అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది.
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణలో ఇప్పటివరకు 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అవి కాస్తా 179కు పెరుగుతాయని.. అదే విధంగా ఏపీలో ఇప్పటివరకు ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు కాస్తా 263కు చేరుకుంటాయని చెబుతున్నారు. ఇక లోక్ సభా స్థానాల విషయానికి వస్తే ఏపీకి 25 నుంచి 38 స్థానాలకు.. తెలంగాణలో ఇప్పటివరకు ఉన్న 17 ఎంపీ స్థానాలు కాస్తా 26కు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు.
సోమవారం సాయంత్రం తాము తీసుకున్న నిర్ణయాన్ని ఎన్డీయే పక్షాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలియజేసినట్లుగా చెబుతున్నారు. తాజాగా జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో జరిగిన సమావేశంలో సీట్ల పెంపు సమాచారాన్ని తెలియజేసినట్లుగా చెబుతున్నారు. కాంగ్రెసేతేర విపక్షాలతోనూ విడిగా భేటీ నిర్వహించారు. వారికి కూడా ఈ సమాచారాన్ని అందిస్తారని చెబుతున్నారు.
అయితే.. నియోజకవర్గాల సంఖ్యను పెంచటానికి ముందు మహిళా రిజర్వేషన్ చట్టం.. డీ లిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లులు తెస్తారని చెబుతన్నారు. లోక్ సభలో దీనికి సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్రం డీలిమిటేషన్ కమిషన్ వేసి.. సీట్ల పెంపు కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని చెబుతున్నారు. మొత్తంగా పెరిగిన చట్టసభల సీట్ల ఆధారంగానే 2029 సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని చెబుతున్నారు.
జనాభా లెక్కల ఆధారంగా దామాషా ప్రకారం సీట్ల పెంపునకు ఓకే చెబితే.. ఉత్తర.. దక్షిణ భారతదేశాల మధ్య తేడాలు వచ్చే అవకాశం ఉందన్న అభ్యంతరాలు మొదట్నించి వినిపిస్తున్నవే. అందుకే.. అలాంటి వివాదాలకు తావు ఇవ్వని రీతిలో అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్ సభ.. అసెంబ్లీ స్థానాల్ని 50 శాతం పెంచాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ నిర్ణయంతో అన్ని రాష్ట్రాలకూ ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతథంగా ఉండనుంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో రానున్న రోజులు దేశ వ్యాప్తంగా రాజకీయ సందడి భారీగా పెరుగుతుందని చెప్పక తప్పదు.