ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ సెగ రాజుకుంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, జనసేనాని పవన్ కళ్యాణ్ మధ్య తాజాగా జరిగిన గంటన్నర సుదీర్ఘ భేటీ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. కేవలం రాజకీయ చర్చలకే పరిమితం కాకుండా, తన కుమారుడు ప్రణీత్ రెడ్డిని కూడా పవన్ దగ్గరకు తీసుకెళ్లడం వెనుక బాలినేని ఒక పక్కా వ్యూహంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ``మరో నాలుగు రోజులు ఆగండి.. ఆ తర్వాత మాట్లాడుదాం`` అంటూ పవన్ ఇచ్చిన గడువు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠభరిత చర్చలకు దారితీస్తోంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన ఒంగోలుపై సమీక్ష జరిపి, చుండూరి రవిని ఇన్ఛార్జ్గా ప్రకటించిన మరుసటి రోజే బాలినేని ఈ అడుగు వేయడం గమనార్హం. గత కొంతకాలంగా బాలినేని మళ్ళీ వైసీపీ గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, జగన్ తీసుకున్న నిర్ణయంతో వైసీపీ ద్వారాలు దాదాపు మూసుకుపోయినట్లేనని స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే బాలినేని తన రూట్ మార్చి, జనసేనలో తన పట్టును నిరూపించుకోవాలని భావిస్తున్నారు. తన వారసుడిని రాజకీయాల్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇప్పించే బాధ్యతను పవన్ కళ్యాణ్కు అప్పగించే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
ఏడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఐదుసార్లు గెలిచిన అపార అనుభవం ఉన్న బాలినేని వంటి సీనియర్ నేతకు జనసేనలో ఇప్పటివరకు సరైన ప్రాధాన్యత దక్కలేదనే అసంతృప్తి ఆయన అనుచరుల్లో ఉంది. అయితే, తాజా భేటీలో పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి సీటుతో పాటు, పార్టీలో తనకు కీలక పదవి ఇవ్వాలని బాలినేని కోరినట్లు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. ఇక పవన్ చెప్పిన ఆ నాలుగు రోజుల గడువు ముగిశాక బాలినేని పొలిటికల్ కెరీర్లో ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ వచ్చే అవకాశం ఉంది. మరి ఒంగోలు కోటలో బాలినేని మార్క్ పాలిటిక్స్ మళ్ళీ పుంజుకుంటాయా లేదా అన్నది చూడాలి.