ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయాన్ని అమలులోకి తెచ్చింది. సామాన్యుల గుండెల్లో గుడి కట్టుకునేలా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ` దివ్యాంగ శక్తి` అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు మహిళలకు ఉచిత ప్రయాణంపై చర్చ జరుగుతుండగా, అనూహ్యంగా దివ్యాంగుల కోసం ఈ భారీ వరాలను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. శారీరక ఇబ్బందులతో ప్రయాణం చేయడం ఒక ఎత్తైతే, దానికి అయ్యే ఖర్చు భరించడం దివ్యాంగులకు మరో భారంగా ఉండేది. ఇప్పుడు ఆ కష్టాలకు సీఎం చెక్ పెట్టారు. కేవలం దివ్యాంగులకే కాకుండా, వారికి తోడుగా వచ్చే సహాయకులకు సైతం టికెట్ ధరలో 50 శాతం రాయితీ కల్పించడం ఈ పథకంలో హైలైట్ అని చెప్పాలి.
బస్సులో సామాన్యుడిలా సీఎం.. కేబినెట్ తో కలిసి సందడి!
ఈ పథకాన్ని కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా, సీఎం చంద్రబాబు స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లారు. మంగళగిరి నుంచి పెనుమాక వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. బస్సులో ఉన్న దివ్యాంగులతో ముచ్చటిస్తూ, వారికి పాస్లను అందజేసి వారి ముఖాల్లో చిరునవ్వులు నింపారు. ఒకే సీటులో సీఎం, డిప్యూటీ సీఎం కూర్చుని ప్రయాణించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దివ్యాంగులు సమాజంలో ఎవరిపైనా ఆధారపడకుండా, ఆత్మవిశ్వాసంతో తిరగాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. విద్యార్థులు, ఉద్యోగులు మరియు వైద్యం కోసం వెళ్లే వారికి ఈ నిర్ణయం ఒక గొప్ప ఊరటనిస్తుంది