మీరు ఆస్తి పన్ను బకాయిలు ఉన్నారా? పెరిగిన వడ్డీని చూసి టెన్షన్ పడుతున్నారా? అయితే మీకు ఒక అదిరిపోయే శుభవార్త. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ పన్ను చెల్లింపుదారులకు కళ్లు చెదిరే ఆఫర్ను ప్రకటించింది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిల మీద పడే వడ్డీ భారాన్ని సగానికి సగం తగ్గించేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు కట్టాల్సిన వడ్డీలో 50 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ అద్భుతమైన అవకాశం అందరికీ ఎల్లప్పుడూ ఉండదు. ఎవరైతే తమ ఆస్తి పన్ను బకాయిలను ఈ నెల 31వ తేదీ లోపు ఒకేసారి చెల్లిస్తారో, వారికి మాత్రమే ఈ వడ్డీ మాఫీ వర్తిస్తుంది. దీనికి సంబంధించి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ ఇప్పటికే జీవో నెం.58 ని విడుదల చేశారు. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో, అటు ప్రజలకు భారం తగ్గించి, ఇటు మున్సిపాలిటీల్లో వసూళ్లను వేగవంతం చేయడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశం.
ముందే కట్టేసిన వారికి రివర్స్ సర్ప్రైజ్!
``మేము ఆల్రెడీ వడ్డీతో కలిపి పన్ను కట్టేసాం కదా.. మా పరిస్థితి ఏంటి?`` అని ఆందోళన చెందుతున్నారా? అక్కడే ప్రభుత్వం ఒక అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది. ముందే పన్ను కట్టిన వారు నష్టపోకుండా, వారు పొందే 50 శాతం రాయితీ మొత్తాన్ని వచ్చే ఏడాది పన్ను బిల్లులో సర్దుబాటు చేస్తారు. అంటే ఇప్పుడు కట్టే వారికి వడ్డీ తగ్గుతుంది, కట్టేసిన వారికి వచ్చే ఏడాది బిల్లు తగ్గుతుంది. ఎటు చూసినా ఇది సామాన్యుడికి లాభం చేకూర్చే నిర్ణయమే.