అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పాలనలో వేగం పెంచారు. కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాకుండా, మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వారికి ర్యాంకులు కేటాయిస్తున్నారు. తాజాగా ఏపీ సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో భాగంగా మంత్రుల పనితీరుపై చంద్రబాబు ఒక కీలక రిపోర్ట్ కార్డ్ ను బయటపెట్టారు. ఫైళ్ల క్లియరెన్స్, శాఖా పరమైన నిర్ణయాల్లో వేగం ఆధారంగా ఈ రేటింగ్స్ ఇచ్చారు.

ఈ రిపోర్ట్ కార్డ్లో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మొదటి స్థానంలో నిలిచారు. సీనియర్ నాయకుడు కావడమే కాకుండా, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ప్లస్ అయ్యింది. శాఖపై పూర్తి పట్టు ఉండటంతో ఫైళ్లను పెండింగ్లో పెట్టకుండా అత్యంత వేగంగా పరిష్కరిస్తూ అచ్చెన్న నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన పనితీరు మిగిలిన మంత్రులకు ఆదర్శంగా నిలిచిందని టాక్ వినిపిస్తోంది.
రెండో స్థానంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిలిచి తన స్పీడ్ను నిరూపించుకున్నారు. అయితే, ఈ ర్యాంకింగ్స్లో అసలు ట్విస్ట్ ఏంటంటే.. 3, 4 స్థానాల్లో కొత్త ఎమ్మెల్యేలు నిలవడం. మూడో స్థానంలో ఉన్న టీజీ భరత్, నాలుగో స్థానంలో ఉన్న కొండపల్లి శ్రీనివాస్ తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచి, మంత్రి పదవులు పొందిన అతి తక్కువ కాలంలోనే సీనియర్లను మించి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీరిద్దరి పనితీరుపై చంద్రబాబు ప్రశంసలు కురిపించినట్లు సమాచారం.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా టాప్-5 జాబితాలో నిలిచి పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఫైళ్ల పరిష్కారంలో ఆయన వేగం పెంచారు. కాగా, ఈ రేటింగ్స్లో హోం మంత్రి వంగలపూడి అనిత అందరికంటే చివరలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో జాప్యం జరగడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పాలనలో వేగం ఉంటేనే ప్రజలకు సకాలంలో సేవలు అందుతాయని మంత్రులందరికీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.