ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నార్త్ అమెరికా స్పెషల్ రిప్రజేంటేటివ్ గా కోమటి జయరాం నేడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లి ఏపీఎన్నార్టీఎస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు దేశాలకు చెందిన ఎన్నారైలు, పండితుల వేద ఆశీర్వచనాల నడుమ కోమటి జయరాం ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది. ఈ కార్యక్రమంలో ఎన్నారై శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీ ఎన్నార్టీ అధ్యక్షులు వేమూరి రవి, సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్ రవి మండలపు, డీసీఎంస్ చైర్మన్ కృష్ణ గొంప, శ్రీకాంత్ దొడ్డపనేని, వెంకట్ జెట్టి, వెంకట్ కోగంటి తదితర ఎన్నారైలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కోమటి జయరాం సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అంతేకాకుండా, అమెరికాలో చదువుకుంటున్న విద్యార్ధులు, అక్కడ పని చేస్తున్న ఉద్యోగులకు ఏవైనా సమస్యలు వాటి పరిష్కారానికి ఆయన కృషి చేస్తారని తెలిపారు. దాంతోపాటు, రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించే విషయంలో కోమటి జయరాం తన వంతు కృషి చేయడంలో సమర్ధవంతంగా పని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.