రాబోయే అసెంబ్లీ ఎన్నికలు(telangana assembly elections) రసవత్తరంగా మారనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటి నుంచే ప్లాన్ సిద్ధం చేసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(cm revanth reddy) నిర్ణయించారు. వాస్తవానికి వచ్చే ఎన్నికలకు ఇంకా.. దాదాపు మూడేళ్ల సమయం ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే.. 2 సంవత్సరాల 9 మాసాల గడువు ఉంది. అయినప్పటికీ.. రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే పక్కా వ్యూహం(plan)తో అడుగులు వేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ప్రజల వద్దకు వెళ్లాలని ఆయన నిర్ణయించారు.
`ప్రజాపాలన`పేరుతో ఇప్పటికే చేపట్టిన కార్యక్రమాన్ని రెండో దశకు విస్తరించాలని, ఇప్పటి వరకు ప్రభు త్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరించాలని సూచించారు. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు. అదేసమయంలో తప్పులు జరిగి ఉంటే.. ఈ రెండు సంవత్సరాల కాలంలో వాటిని కూడా రాసుకుని.. ఇకపై జరగకుండా జాగ్రత్తలు తీసుకునే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. అన్ని వర్గాలసంక్షేమం, మేలు ప్రాతిపదికగా.. ప్రజల మధ్యకు వెళ్లాలని నిర్ణయించడం గమనార్హం.
ఇంత ముందే ఎందుకు?
ఎన్నికలకు దాదాపు మూడు సంవత్సరాల సమయం ఉన్నా.. ఇంత తొందరగా ప్రభుత్వం ప్రజల మధ్య కు వెళ్లాలని నిర్ణయం ఎందుకు? అనేది ప్రశ్న. దీనికి ప్రధానంగా రాజకీయంగా ఉన్న ఒత్తిడిలు.. ప్రత్యర్థు లు బలం పుంజుకునే అవకాశం ఉన్న నేపథ్యమేనని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రజల మైండ్ సెట్ .. కాంగ్రెస్ వైపు నుంచి మళ్లే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ ఎస్ వ్యూహాత్మక రాజకీయాలకు తోడు.. పెరుగుతున్న పార్టీల సంఖ్య, సొంత పార్టీలోనే అసంతృప్తి సెగలు వంటివి కూడా.. రేవంత్ సర్కారును ముందుగానే అలెర్ట్ చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
లెక్కకు మిక్కిలిగా..
ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన పార్టీలు.. బీఆర్ఎస్(brs), కాంగ్రెస్(congress), బీజేపీ(bjp)లే అయినప్పటికీ.. ఎంఐఎం సహా ఇతర కమ్యూనిస్టులతో పాటు.. కవిత పెడుతున్న పార్టీ, అదేసమయంలో తీన్మార్ మల్లన్న ప్రకటించిన పార్టీలు కూడా ఉన్నాయి. వాస్తవానికి చిన్న చితక పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి లేకపోయినా.. అవి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రధాన పార్టీలకు సంకటంగా మారే అవకాశం ఉంది. ఓటు బ్యాంకును చీల్చనున్నాయన్న చర్చ కూడా ఉంది. సామాజిక వర్గాలు, సెంటిమెంటు, ఉద్యమం .. ఇలా అనేక అంశాలకు తోడు ప్రభుత్వ వ్యతిరేకత కూడా పెరిగిపోతే.. రేవంత్ రెడ్డి లక్ష్యం సాకారం కావడం ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే.. ఇప్పటి నుంచే ఆయన అలెర్ట్ అవుతున్నారన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.