తమిళనాడు మాజీ సిఎం, అన్నాడిఎంకే వ్యవస్థాపకురాలు జే. జయలలిత ఓ అసాధారణ పరిపాలకురాలు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఆకాశానికి ఎత్తేసారు. ఆమె జయంతి సందర్భంగా, జయలలితతో ఉన్న అనుబంధాన్ని, ఆమె ధైర్యాన్ని ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. ఆమె బ్రతికి ఉన్న రోజుల్లో ఎంతో మంచి స్నేహం ఉండేదని మోడీ తెలిపారు. అమ్మతో తనకు మంచి అనుబంధం ఉన్న ప్రధాని, జయలలితకు ఘన నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. అమ్మ ఒక అసాధారణమైన పరిపాలకురాలు అంటూ కీర్తించారు.
ప్రజా సంక్షేమాన్ని, మహిళా సాధికారతను జయలలిత ఎంతో కీలకంగా భావించేవారని మోడీ కొనియాడారు. సంక్షేమం కోసం పాటుపడే మనస్తత్వం ఉన్న నాయకురాలు జయలలిత అని, అలాంటి నాయకులు ఎప్పుడూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిలో ఉంటారని మోడీ ప్రసంశించారు. అమ్మ జయలలిత అటువంటి ప్రజాదరణ పొందిన నాయకురాలుగా మోడీ పేర్కొన్నారు. రాష్ట్ర సిఎంగా తమిళ ప్రజల అభ్యున్నతి కోసం జయలలిత ఎంతో కృషి చేసినట్లు మోడీ వ్యాఖ్యానించారు. అమ్మ అమలు చేసిన సంక్షేమ పథకాలు అద్భుతమన్నారు మోడీ.
జయలలిత పరిపాలనలో, వ్యక్తిగత జీవితంలో తీసుకునే నిర్ణయాలు ఎంతో స్పష్టంగా ఉండేవన్న మోడీ, సామాజిక న్యాయం కోసం జయలలిత ఎంతో కృషి చేసారన్నారు. జయలలిత జీవిత ప్రయాణం ఎంతో పట్టుదల, మనోధైర్యంతో కూడుకున్నదని తెలిపిన మోడీ, ఆ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఇద్దరూ సిఎంలుగా పని చేసిన రోజులను ప్ప్రస్తావించారు. 2002, 2012లో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జయలలిత హాజరు అయ్యారన్నారు.
ఆ తర్వాతి నుంచి తమ స్నేహం కొనసాగినట్లు పేర్కొన్నారు. గతంలో పొంగల్ పండుగ సందర్భంగా చెన్నైలో ఆమె తనను భోజనానికి ఆహ్వానించారన్నారు. ఆ ఆత్మీయతను ఎప్పటికీ మర్చిపోలేననని మోడీ గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో, సుపరిపాలన గురించి తామిద్దరం తరచుగా చర్చించుకునేవాళ్లమని మోడీ తెలిపారు.