వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు.. తన మాజీ డ్రైవర్ ను హత్య చేసి.. శవాన్ని డ్రైవర్ ఇంటికి కారులో తీసుకువెళ్లి అప్పగించిన కేసు అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది. కేసు ప్రారంభంలో అనంతబాబును సమర్థించేందు కు వైసీపీ ప్రయత్నించినా.. ప్రజల నుంచి వ్యతిరేకత నేపథ్యంలో కొన్నాళ్లపాటు అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కానీ.. ఆయన పదవిని మాత్రం కొనసాగించారు. ఇక ఆతర్వాత.. తిరిగి పార్టీలోకి తీసుకున్నారు.
ఇక, వైసీపీ హయాంలో పోలీసులు కూడా ఈ కేసును తూతూ మంత్రం అన్నట్టుగానే నమోదు నుంచి విచారణ వరకు వ్యవహరించారన్న ఆరోపణలు వున్నాయి. తాజాగా దీనిపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. నిందితుడు అనంత బాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని.. కేసులో పసలేకుండా చేసే ప్రయత్నం చేశారని.. ఎవరినో ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోందని.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించడం గమనార్హం.
కాపాడారు!
నిందితుడు, ఎమ్మెల్సీ కావడం.. అధికార పార్టీ నాయకుడు కావడంతో పోలీసులు.. ఆయనకు బెయిల్ వచ్చేలా చార్జిషీట్ను అత్యంత బలహీనంగా మార్చారని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాదు.. దీని వెనుక చాలానే కుట్ర(Large conspiracy) జరిగినట్టు కూడా తెలుస్తోందని సీజేఐ వ్యాఖ్యానించారు. సదరు పోలీసుల వ్యవహారంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటామని ట్రయల్ కోర్టుకు చెప్పినా.. ఇప్పటి వరకు ఎందుకు తీసుకోలేక పోయారని.. ప్రభుత్వం ఏం చేస్తోందని ఘాటుగా ప్రశ్నించారు.
డీజీపీ, ఎస్పీలు ఏం చేస్తున్నారని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. కేసు విచారణను ఇక నుంచి హైకోర్టు సీనియర్ న్యాయాధికారి చూడాలని ఆదేశించారు. రోజువారీ విచారణ జరగడంతోపాటు.. పక్కా చార్జిషీట్ దాఖలు చేయాలని పేర్కొన్నారు. ఒకవేళ అన్ని స్థాయిల్లోనూ విఫలమైతే.. తామే సీబీఐకి అప్పగిస్తామని తేల్చి చెప్పారు. మొత్తం విచారణను ఈ ఏడాది నవంబరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.