ఆహ్వానించిన అందరూ కుటుంబసమేతంగా హాజరయ్యారు. హాలు పిల్లల కేరింతలతో దద్దరిల్లింది. నిత్యమూ ఒకరినొకరు కలిసే ప్రజాప్రతినిధులే అయినా.. ఆత్మీయ పలకరింపులు..స్వచ్ఛమైన నవ్వులతో గంటలకొద్దీ సమయం నిమిషాల్లా గడిపేశారు. ఆనందాలు నిండుగా జరిగిన ఆత్మీయ పండుగకు ఉండవల్లి నివాసం వేదికైంది.
కూటమి ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలు నిర్వహిస్తున్న లోకేష్ బుధవారం రాత్రి అనంతపురం, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాల పరిధి కూటమి ఎంపీ, ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలను కుటుంబాలతో సహా ఆహ్వానించారు. ఈ విందు సమావేశం కుటుంబవేడుకను తలపించేలా సందడిగా సాగింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అనే భేదాల్లేకుండా స్నేహపూర్వక సంభాషణలతో గడిపారు.
కుటుంబసభ్యులను తీసుకురాని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిని మంత్రి నారా లోకేష్ ఆట పట్టించారు. చిన్నారులను ఎత్తుకుని ముద్దాడి, హైఫైలు కొడుతూ లోకేష్ కూడా చిన్నపిల్లాడిలా సరదాగా గడిపారు. ప్రజాప్రతినిధులకు ఒక ఫైల్ సిబ్బంది అందజేశారు. అవి చూసిన ప్రజాప్రతినిధులు ఆశ్చర్యపోయారు. తాము ఇచ్చిన వినతులు ఏవి పరిష్కారమయ్యాయో? ఏవి కాలేదో నివేదిక రూపంలో ఇచ్చిన మంత్రి లోకేష్ బాధ్యతాయుత సంస్కారాన్ని మెచ్చుకున్నారు. ఇంటికొచ్చిన సోదరీమణులందరికీ మంగళగిరి వీవర్ శాల నుంచి తెప్పించిన పట్టుచీరలను లోకేష్ అందజేశారు.
అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, మంత్రి పయ్యావుల కేశవ్ (ఉరవకొండ), ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు (రాయదుర్గం), గుమ్మనూరు జయరాం (గుంతకల్లు), జేసీ అస్మిత్ రెడ్డి (తాడిపత్రి), బండారు శ్రావణిశ్రీ (సింగనమల), దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ (అనంతపురం అర్బన్), అమిలినేని సురేంద్రబాబు (కళ్యాణ దుర్గం), హిందూపురం ఎంపీ బీకే పార్థసారధి, మంత్రి సవిత (పెనుకొండ), మంత్రి సత్యకుమార్ (ధర్మవరం-బీజేపీ), ఎంఎస్ రాజు (మడకశిర), పల్లె సింధూరరెడ్డి (పుట్టపర్తి), కందికుంట వెంకటప్రసాద్ (కదిరి), పరిటాల సునీత (రాప్తాడు)లు కుటుంబసభ్యులతో లోకేష్ ఆత్మీయ విందుకు హాజరయ్యారు.