వైసీపీ అంటేనే జనాలకు హడల్. ఆ పార్టీ అంటేనే ప్రజలు భయపడుతున్నారు...అంటూ కూటమి నాయకులు తరచుగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. రప్పా రప్పా నరుకుతాం.. అంటూ.. పొటే ళ్లను బహిరంగంగా నరికి జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేయడంతోపాటు.. రోడ్డుపై కత్తులతో కేకులు కట్ చేయడం వంటివి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న మాట వాస్తవం కూడా. అయితే.. ఇంత జరుగుతున్నా.. వైసీపీ మాత్రం వీటిని సమర్ధిస్తోంది.
పిల్లోళ్లు ముచ్చట పడ్డారు.. అంటూ.. పొట్టేళ్లను బహిరంగంగా నరకడాన్ని, వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడాన్ని జగన్ సమర్థించారు. ఇది మరింత భయంకరంగా మారింది. ఇక, ఇప్పుడు తాజాగా విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ తన నివాసం నుంచి బయలు దేశారు. పేరు కు పరామర్శ యాత్రే అయినా.. ఇది బలప్రదర్శన యాత్రగానే సాగుతోంది. ఈ క్రమంలో కార్యకర్తలు చేస్తున్న వీరంగం ప్రజలను భయోత్పాతానికి గురి చేస్తోంది.
ఇబ్రహీంపట్నం సెంటర్ అంటే.. అటు హైదరాబాద్కు, ఇటు విజయవాడకు కూడా మధ్య ఉంటుంది. నిత్యం భారీ రద్దీ నెలకొంటుంది. ఈ రహాదారిపైనే జగన్ ప్రయాణించి.. జోగి ఇంటికి చేరుకుంటారు. అయితే.. వైసీపీ కార్యకర్తలు కొందరు ఈ సెంటర్లోనే రెచ్చిపోయారు. కూటమి పార్టీల నేతలను బూతులతో దూషించారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్లపై చెప్పనలవి కాని బూతులతో తిట్టారు. అక్కడితో కూడా ఆగకుండా.. రోడ్డుపై బైక్లతో స్టంట్లు చేస్తూ అలజడి సృష్టించారు.
అంతేనా.. అంటే.. మరికొందరు కార్యకర్తలు చేతులుకోసుకుని వచ్చిన రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు రక్త తిలకం దిద్దారు. ఆ ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ.. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ఈ పరిణామాలు వైసీపీ నాయకులు రంజుగా ఉంటే.. చూపరులకు, స్థానిక ప్రయాణికులకు మాత్రం హడలెత్తించాయి. చిత్రం ఏంటంటే.. పోలీసులు ఉన్నా.. వైసీపీ నాయకుల ముందు.. ఏమీ చేయలేని పరిస్థితి కనిపించింది. అందుకే.. వైసీపీ అంటే జనాలకు హడల్!.