ఐటీ, విద్యా శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డైనమిక్ లీడర్ కు మారుపేరుగా మారుతున్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపుతున్నారు. తాజాగా ఓ ఇంటర్ విద్యార్థినికి ఇచ్చిన మాటను గంటల వ్యవధిలోనే నిలబెట్టుకుని దటీజ్ లోకేష్ అనిపించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శనివారం విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో లోకేష్ ముఖాముఖి సమావేశం అయ్యారు. అయితే రమ్య అనే సీనియర్ ఇంటర్ బైపీసీ విద్యార్థినికళాశాల వెలుపల రాత్రి వేళ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరగా.. గంటల వ్యవధిలోనే లోకేష్ స్పందించారు. పాయకాపురం జూనియర్ కళాశాల ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు.
అలాగే విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉన్నాయేమో కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. గంటల వ్యవధిలోనే సమస్యను పరిష్కరించడంతో పాయకాపురం జూనియర్ కళాశాల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు సైతం మంత్రిగారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. లోకేష్ మాటిచ్చినాడంటే చేసినాడనే అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.