ఏ వేదికెక్కినా.. ఏం మాట్లాడినా.. ఏపీ గురించి, ఏపీ ప్రజల, రాజధాని అమరావతి గురించి పదే పదే చెప్పే సీఎం చంద్రబాబు తాజాగా కూడాఅదే పనిచేశారు. కీలకమైన నీతి ఆయోగ్ భేటీలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన 11 మాసాల్లో జరిగిన అభివృద్ధిని ఈ సమావేశంలో వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం పాల్గొన్నారు.
ముఖ్యంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలకంగా భావిస్తున్న వికసిత భారత్-2047 లక్ష్యాన్ని తా ము కూడా అందిపుచ్చుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే స్వర్ణాంధ్ర నివేదికను రెడీ చేసుకున్నట్టు వివరించారు. దీనిని అమలు చేయడం ద్వారా ఏపీని త్వరత్వరగా అభివృద్ధి పధంలో ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్రంతోపాటు.. దేశ పురోభివృద్ధికి ఉపయోగపడే పలు కీలక అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. ముఖ్యంగా పేదరికం రూపుమాపడంలో కీలకమైన పీ-4ను ఆయన సమగ్రంగా వివరించారు. సమాజంలో అత్యున్నతస్థాయిలో ఉన్న వారు.. పేదలను బాగు చేసే కార్యక్రమంగా దీనిని అభివర్ణించారు. దీని ద్వారా ప్రభుత్వాలపై భారం లేకుండా.. సమాజంలోని పేదరికాన్ని రూపు మాపొచ్చని.. ఇది దేశానికే మార్గదర్శకంగా ఉండేలా రూపొందించినట్టు చెప్పారు.
అలాగే.. ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ కార్డు(కుటుంబలబ్ధిదారుల వివరాలతో కూడిన కార్డులు)ను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వనున్నట్టు చంద్రబాబు చెప్పారు. ముఖ్యంగా 2.4 ట్రిలియన్ డాలర్ల వృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. తద్వారా రాష్ట్రాన్ని దేశంలోనే ముందు నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి అపారమైన తీర ప్రాంతం ఉందని.. దీనిని వినియోగించుకుని వృద్ధి బాటపడుతున్నట్టు వివరించారు.
కాగా, ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో అరుదైన దృశ్యం కనిపించింది. ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ప్రధాని మోదీ..ముగ్గురు చిట్ చాట్ చేస్తుూ కనిపించారు.