రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉద్యమించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిప్పులు చెరుగుతున్నారు. కొందరు కన్నీళ్లు పెడుతుంటే.. మరికొందరు వైసీపీనాయకులపైనా.. ముఖ్యంగా, జగన్ , భారతిలపై శాసనార్థాలు కూడా పెడుతున్నారు. ఇంతకీ కారణం.. వైసీపీ అధికారిక మీడియా సాక్షిలో జరిగిన చర్చలో అమరావతి మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడమే. దీనిపై నే వారు కదం తొక్కుతున్నారు. గత ఐదేళ్లలో తమపై అనేక రూపాల్లో దాడిచేశారని.. అయినా భరించామని చెబుతున్నారు.
కానీ, ఇప్పుడు మహిళల ఆత్మగౌరవంపైనా.. వారి జీవితాలపైనా దాడులు చేస్తుంటే.. ఎలా చూస్తూ ఊరు కుంటామని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో తమ జీవితాలు అల్లకల్లోలంగా మారుతాయని.. తమ కుటుంబా లకే మచ్చ అనికూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వారు కోరుతున్నది కేవలం క్షమాపణలు!.జరిగిన ఘటనకు తమ బాధ్యతలేదని తప్పించుకోవడం కాదని.. ఓ మహిళగా భారతి, ఓ పార్టీ నాయకుడిగా జగన్ తమకు క్షమాపణలు చెప్పాలని వార కోరుతున్నారు.
ఈ నేపథ్యంలోనే కేసులు పెడుతున్నారు. రోడ్డెక్కి నినాదాలు చేస్తున్నారు. తాజాగా మంగళశారం కూడా.. సాక్షి కార్యాలయాల వద్ద మహిళలు ఉద్యమించారు. బోర్డులు తొలగించారు. పేపర్లను తగుల బెట్టారు. అయితే.. ఇంత జరుగుతున్నా.. జగన్ కానీ, భారతి కానీ.. ఎవరూ బయటకు రాలేదు. పన్నెత్త క్షమాపణ కానీ.. కనీసం.. ఈ విషయంపై మేం విచారణ చేస్తున్నాం.. బాధ్యుతలపై అంతర్గతంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పకపోవడం గమనార్హం.
ఇది రాజకీయంగా వైసీపీకి డ్యామేజీ చేస్తుందన్న సూచనలను కూడా జగన్ పట్టించుకోవడం లేదు. పైగా దీనిని రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్లు తెరవెనుక ఉండి ఇవన్నీ చేయిస్తున్నారని చెబుతున్నారు. కానీ.. వారు చేయించినా చేయించకపోయినా.. మహిళలు అయితే.. అంత చైతన్యం లేని వారు అయితే కాదన్న విషయాన్ని జగన్ గుర్తించలేక పోతున్నారు. ఈ మొండితనం.. పెంకితనమే జగన్ను, పార్టీని కూడా ఇరకాటంలోకి నెడుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.