వైసీపీ అధినేత జగన్ తనకు తానే జబ్బలు చరుచుకున్నారు. తనపాలనకు సర్టిఫికెట్లు కూడా ఇచ్చుకు న్నారు. తాజాగా ప్రకాశం జిల్లాపొదిలిలో పర్యటించిన ఆయన ఇక్కడి పొగాకు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. తొలుత ఆయన పర్యటనను మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే.. పోలీసులు వారిని తప్పించి.. జగన్ను ముందుకు తీసుకువెళ్లారు. ఈ పర్యటనలో జగన్ రైతులను కలుసుకుని వారికి భరోసా కల్పించారు.
అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వ్యాఖ్యా నించారు. అయితే.. చంద్రబాబు వీరిని పట్టించుకునే పరిస్థితిలో లేరని విమర్శించారు. తమ హయాంలో రైతులు రాజుల్లా మెలిగారని సెల్ప్ గోల్ వేసుకున్నారు. చంద్రబాబు సీఎం కావడం రైతుల పాలిట శాపం గా మారిందని దుయ్యబట్టారు. కూటమి రాకతోనే.. రైతులకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయని అన్నా రు. రాష్ట్రంలో పరిస్థితులు చూసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు.
ప్రకాశం జిల్లా పరుచూరు, కొండెపి నియోజకవర్గాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని జగన్ వివరించారు. ఇదంతా కూటమి ప్రభుత్వం వల్లే జరుగుతున్నాయన్నారు. వైసీపీ పాలనలో ఖరీఫ్ సీజన్ లోనే పెట్టుబడి సాయం అందించినట్టు చెప్పారు. చంద్రబాబు వచ్చాక రైతు భరోసా లేకుండా పోయింద న్నారు. గతేడాది రైతు భరోసా 20 వేల రూపాయలను ఎగ్గొట్టారని విమర్శించారు. ``కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా.. రాష్ట్రం నుంచి అనేక పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చాం. ఏ పంటకైనా గిట్టుబాటు ధర లేకుంటే ఆర్బీకే ద్వారా ఇచ్చేవాళ్లం.`` అని జగన్ వివరించారు. కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
ఇదే సమయంలో సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. వ్యవసాయం దండగ అనే రీతిలో చంద్రబాబు పాలన కొనసాగుతోందన్నారు. పొగాకు వేసుకోమని చెప్పి రైతులను నట్టేట ముంచారన్నారు. రైతులకు ప్రభుత్వం నుంచి మద్దతు లభించకపోతే.. తామే ఉద్యమిస్తామన్నారు.