ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశించి తాజాగా బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు జనసైనికుల ఆగ్రహానికి కారణం అయ్యాయి. ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న కవిత.. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం అయ్యేంత స్థాయి లేదంటూ నోరు జారారు. ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్ వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతారని యాంకర్ ప్రశ్నించగా.. పార్టీ పెట్టిన 15 ఏళ్లకు ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ కళ్యాణ్.. ఏపీలో వైసీపీ మినహా దాదాపు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు, అనుకోకుండా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అది ఏపీ ప్రజల దురదృష్టమంటూ కవిత వ్యాఖ్యానించారు. పాలిటిక్స్లోకి వచ్చిన తొలినాళ్లలో పూర్తిగా వామపక్ష భావజాలంతో కనిపించిన పవన్ కళ్యాణ్.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక హిందుత్వం మీద ఆయనకు అతిభక్తి పెరిగిపోయిందని అన్నారు. పవన్ చేసే ప్రకటనల్లో ఒకదానికొకటి పొంతన ఉండదని కవిత ఎద్దేవా చేశారు. రేపో మాపో తమిళనాడుకు వెళ్లి హిందీ ఇంపోజ్ చేయబోమని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కవిత అన్నారు. అనుకోకుండా ఏపీకి ఉపముఖ్యమంత్రి అయ్యారే తప్ప.. నిజానికి పవన్ సీరియస్ పొలిటీషియన్ కాదని, ఆయన వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కవిత విమర్శించారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. జనసైనికులు కవితను ఉతికారేస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో చిప్ప కూడు తిన్న నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నావా? అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి ఒక స్కామ్ చేసి, జైల్ లో నెలలు గడిపి, చిప్ప కూడు తింటేనే కానీ నీలాగ సీరియస్ రాజకీయ నాయకులు అవ్వలేరులే అంటూ కవితను ట్రోల్ చేస్తున్నారు. కవిత లిక్కర్ స్కామ్ వీడియోను సైతం వెలికితీసి నెట్టింట వైరల్ చేస్తున్నారు.