విశాఖపట్నానికి గూగుల్(google) రాక రాష్ట్రానికే గేమ్ఛేంజర్ అని ఏపీ సీఎం చంద్రబాబు(cm chandrababu) అన్నారు. గూగుల్ డేటా సెంటర్ దేశానికే గ్రోత్ ఇంజిన్ అని పేర్కొన్నారు. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటవుతోందన్నారు.
ఒకప్పుడు సెర్చ్ ఇంజన్గా ప్రారంభమైన గూగుల్.. ఇప్పుడు భారత దేశానికి గ్రోత్ ఇంజన్గా మారుతుంద న్నారు. అంతేకాదు.. ప్రపంచమంతా గూగుల్లో సెర్చ్ చేస్తుంటే.. గూగుల్ మాత్రం ఏపీని ఎంచుకుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. విశాఖను గూగుల్ ఎంపిక చేసుకోవడం రాష్ట్రానికి గర్వకారణమని వ్యాఖ్యానించారు. గూగుల్, ఎయిర్టెల్ రెండూ కీలక సంస్థలని వెల్లడించారు. సెప్టెంబర్ 2028 నాటికి గూగుల్ డేటా సెంటర్ పూర్తవుతుందని స్పష్టం చేశారు. దీనివల్ల ఉద్యోగ, ఉపాధి రంగాలకు మరింత ఊపు వస్తుందని చెప్పారు. అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు విస్తరిస్తాయన్నారు.
విశాఖకు గోదావరి నీరు!
రానున్న రెండు మాసాల్లోనే అనకాపల్లి, విశాఖపట్నానికి గోదావరి నీళ్లు వస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగనున్నాయని, దీనికి ముందే.. పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తిచేసి.. నీటిని అందిస్తామని తెలిపారు. అదేవిధంగా విశాఖ అన్ని రంగాల్లోనూ అభివృద్ది సాధిస్తోందని చంద్రబాబు చెప్పారు. విశాఖ నగరానికే కాదు.. జిల్లా వ్యాప్యంగా కూడా అద్భుతమైన కనెక్టివిటీ ఉందని తెలిపారు.
అనకాపల్లి మరో రంగారెడ్డి!
ఇటీవల ప్రారంభించిన ఆర్సెలార్ మిట్లర్ స్టీల్ ఫ్యాక్టరీ కూడా.. 2028 చివరినాటికి తొలిదశ పూర్తి కానుందని తెలిపారు. ఏఐ సిటీగా విశాఖ ఉంటుందని.. అనకాపల్లి జిల్లా మరోరంగారెడ్డి జిల్లా కానుందని ఉద్ఘాటించారు. సాంకేతిక రంగంలో ఏపీ దేశానికే గేట్వేగా మారుతుందని తెలిపారు. రాష్ట్ర వాటాదారులు.. పెట్టుబడిదారులేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కేవలం ఒప్పందాలు చేసుకుని చేతులు దులుపుకొనేదిలేదని.. అవి వచ్చేవరకు వెంటపడతామని తెలిపారు.