తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు వినిపిస్తోంది.. అదే పుట్టా మహేష్ కుమార్ యాదవ్. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ ఉదంతం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ఏలూరు ఎంపీ వార్తల్లో నిలిచారు. అయితే, అసలు రాయలసీమకు చెందిన ఈ నేత, ఎక్కడో ఉన్న ఏలూరు పార్లమెంట్ స్థానానికి ఎలా వెళ్లారు? అక్కడ టిక్కెట్ ఎలా దక్కించుకున్నారు? దీని వెనుక ఉన్న అసలు పవర్ నెట్వర్క్ ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పుట్టా మహేష్ వెనుక ఉన్న అత్యంత బలమైన శక్తి ఆయన మామ, సీనియర్ రాజకీయ వేత్త యనమల రామకృష్ణుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా, ఆర్థిక మంత్రిగా చక్రం తిప్పిన యనమల.. మహేష్కు స్వయానా మామగారు. యనమల కుమార్తె, ప్రస్తుత తుని ఎమ్మెల్యే దివ్య భర్తే ఈ మహేష్ కుమార్ యాదవ్. గోదావరి జిల్లాల్లో యనమల కుటుంబానికి ఉన్న పట్టు, పార్టీ అధిష్టానం వద్ద ఉన్న పరపతి వెరసి.. రాయలసీమ వాసి అయినప్పటికీ మహేష్కు ఏలూరు అల్లుడి కోటాలో ఎంపీ సీటు సులభంగా దక్కిందనేది రాజకీయ వర్గాల్లో వినిపించే మాట.
అయితే ఈ బంధుత్వం ఒక్క ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదు. తెలంగాణలోని బలమైన బీసీ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబంతోనూ మహేష్కు విడదీయలేని బంధం ఉంది. మహేష్ సోదరిని తలసాని కుమారుడు సాయికిరణ్ వివాహం చేసుకున్నారు. అటు యనమల, ఇటు తలసాని.. ఇలా రెండు రాష్ట్రాల్లోని అగ్రశ్రేణి బీసీ నేతల అండదండలు ఉండటంతో మహేష్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ చాలా గ్రాండ్గా జరిగింది. గత ఎన్నికల్లో మాగుంట బాబు వంటి సీనియర్లను కాదని మరీ టిక్కెట్ దక్కించుకోవడంలో ఈ ఫ్యామిలీ పవర్ కీలక పాత్ర పోషించింది.
పుట్టా మహేష్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్గా, ప్రస్తుత మైదుకూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తండ్రి, మామ, వియ్యంకులు అందరూ పవర్ఫుల్ పొజిషన్లలో ఉన్న సమయంలో.. ఈ డ్రగ్స్ వివాదం ఇటు కూటమి ప్రభుత్వానికి, అటు బంధువులైన పెద్ద నేతలకు తలపోటుగా మారింది. ఇంతటి రాజకీయ అండ ఉన్న నేత, ఇప్పుడు ఈ వివాదం నుండి ఎలా బయటపడతారో, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.