ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు అమరావతి వైపే ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మార్క్ పాలనలో భాగంగా మరో కీలక నిర్ణయానికి సిద్ధమయ్యారు. ఉగాది పర్వదినం తర్వాత ఏ క్షణమైనా రాష్ట్ర మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులు ఉంటాయనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పనిచేయని వారికి ఉద్వాసన.. పనిచేసే వారికి పట్టాభిషేకం అనే నినాదంతో బాబు తన టీమ్ను రీషఫిల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఎవరికి చెక్? ఎవరికి లక్?
ప్రస్తుతం ఉన్న 25 మంది మంత్రులలో దాదాపు 7 నుండి 9 మందిపై వేటు పడే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వారిని పక్కన పెట్టాలని బాబు ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, పార్టీ అంతర్గత సర్వేల ఆధారంగా ఈ డెడ్ లైన్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వీరి స్థానంలో కొత్త రక్తాన్ని ఎక్కించడంతో పాటు, అనుభవజ్ఞులైన సీనియర్లకు మళ్లీ పెద్దపీట వేయబోతున్నారు.
ఈసారి కేబినెట్ విస్తరణలో ఊహించని పేర్లు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజుకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని గట్టిగా వినిపిస్తోంది. మిత్రపక్షాల మధ్య సమన్వయం పెంచేలా ఈ నిర్ణయం ఉండబోతోంది. అలాగే, కాపు సామాజిక వర్గం నుంచి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పేరు దాదాపు ఖరారైనట్లు టాక్. ఒకవేళ సమీకరణాలు మారితే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మరో బలమైన నేతకు అవకాశం దక్కవచ్చు.
కేవలం వ్యక్తులను మార్చడమే కాకుండా, సామాజిక వర్గాల అసంతృప్తి కలగకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు. ఒక సామాజిక వర్గం నుంచి మంత్రిని తొలగిస్తే, అదే వర్గానికి చెందిన మరో సమర్థుడైన నేతకు అవకాశం ఇచ్చేలా సోషల్ ఇంజనీరింగ్ ప్లాన్ చేశారు. అంతేకాకుండా, ఈసారి మహిళా మంత్రుల సంఖ్యను పెంచడం ద్వారా రాబోయే ఎన్నికల నాటికి మహిళా ఓటర్లను ఆకట్టుకోవాలనేది బాబు మాస్టర్ ప్లాన్ గా తెలుస్తోంది.మొత్తానికి ఉగాది పచ్చడిలో తీపి, వొగరు ఉన్నట్టే.. ఈ కేబినెట్ ప్రక్షాళన కొందరికి తీపి కబురు అందిస్తుంటే, మరికొందరికి చేదు అనుభవాన్ని మిగిల్చేలా ఉంది. మరి ఆ 9 మంది మంత్రులు ఎవరు? కొత్తగా వచ్చే ఆ లక్కీ లీడర్స్ ఎవరో తెలియాలంటే మరో కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.