ఏపీ రాజధాని అమరావతి రైతులకు సీఎం చంద్రబాబు భారీ వరం ప్రకటించారు. రాజధానికి తొలి దశలో భూములు ఇచ్చిన రైతులకు సంబంధించిన రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి నారాయణ తాజాగా రాజధాని రైతులకు తెలిపారు. 2014-15 మధ్య కాలంలో రాజధాని రైతులు 33 వేల ఎకరాల భూములను రాజధాని కోసం పూలింగ్ విధానంలో ఇచ్చారు.
వీరికి ప్రభుత్వంఆయా భూములను బట్టి నివాసయోగ్యమైన ప్లాట్లతోపాటు.. కమర్షియల్ ఫ్లాట్లను కూడా అందించాల్సి ఉంది. అయితే.. వైసీపీ హయాంలో ఐదేళ్లు రాజధాని ఊసు ఎత్తని నేపథ్యంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పైగా.. వారికి ఇవ్వాల్సిని కౌలును కూడా ఇవ్వకపోవడంతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నారు. దీంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకున్నారు.
ఈ నేపథ్యంలో తమ అప్పులను మాఫీ చేసేలా ప్రభుత్వం సహకరించాలంటూ.. రైతులు కొన్నాళ్లుగా కోరు తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్.. రైతుల విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. తాజాగా రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రైతుల విజ్ఞప్తిని సీఎం చంద్రబాబు సానుకూలంగా తీసుకున్నారు. రైతులకు రుణ మాఫీ ప్రకటించారు.
దీని ప్రకారం.. ఒక్కొక్క రైతు కుటుంబానికీ 1.5 లక్షల రూపాయల వరకు రుణాలను మాఫీ చేయనున్నారు. అదేవిధంగా ఎక్కువ మొత్తంలో తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేసేలా బ్యాంకులతో మాట్లాడి ఒప్పిం చనున్నారు. తద్వారా.. రైతులకు మరింత ఉపశమనం కలగనుంది. అదేవిధంగా రైతులకు ప్రస్తుతం ఏటా ఇస్తున్న కౌలు.. రూ.40వేలు(ఎకరానికి)ను ఇక నుంచి 50 వేల రూపాయలకు పెంచనున్నారు. అంటే.. ఒకే విడత రూ.10 వేల చొప్పున కౌలు పెంచనున్నారు. ఈ నిర్ణయాన్ని కూడా సీఎం తాజాగా ప్రకటించారు.