ఫేక్ ప్రచారాలు చేయడంలో వైసీపీ పీహెచ్డీ చేసిందా అన్న అనుమానం సామాన్య ప్రజలకూ కలుగుతోంది. కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు వైసీపీ శతవిధాల ప్రయత్నిస్తోంది. అందుకు సోషల్ మీడియాను ప్రధాన ఆయుధంగా మార్చుకుంది. తిమ్మిని బమ్మి.. బమ్మిని తిమ్మి చేసి ప్రజలను మోసం చేయాలని చూస్తోంది. కానీ తాడిని తన్నేవాడుంటే, వాడి తల తన్నేవాడు ఉంటాడు అన్న చందంగా వైసీపీ ఫేక్ ప్రచారాలను కూటమి సర్కార్ అంతే ధీటుగా తిప్పి కొడుతోంది. అందుకు తాజా పరిణామమే ఉదాహరణ.
రాష్ట్రంలో ఎరువుల కోరత నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. ఎరువుల కొరతపై చంద్రబాబు మీడియా ముఖంగా స్పందించారు. అయితే ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలను కట్ చేసి ఎడిట్ చేసి సీఎం చంద్రబాబు ఏపీ రైతులకు వార్నింగ్ ఇచ్చినట్లుగా ఓ ఫేక్ వీడియోను క్రియేట్ చేసి వైసీపీ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేసింది.
ఈ ఫేక్ వీడియో సిఐడి సైబర్ విభాగం దృష్టికి వెళ్లగా.. వారు కేసు నమోదు చేశారు. మరోవైపు వైసీపీ తప్పుడు ప్రచారాన్ని కూటమి సర్కార్ కూడా సీరియస్ గా తీసుకుంది. తాజాగా నారా లోకేష్ ఫేక్ వీడియోపై రియాక్ట్ అవుతూ.. కోరలు పీకేసినా వైసీపీకి బుద్ధి రాలేదంటూ ఎద్దేవా చేశారు. `కోరలు పీకేసినా పాము కాటేస్తుందట! వైసీపీని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అనే విష సర్పం కోరలు జనం పీకేశారు. అయినా వైసీపీ విష సర్పం ప్రతి క్షణమూ విషం కక్కుతూనే ఉంది.
యూరియా విషయంలో, ప్రభుత్వ పథకాల విషయంలో ప్రతిదాంట్లో ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రచారాలు, ఫేక్ ఆందోళనలు చేస్తున్న వైసీపీ క్రిమినల్స్ సీఎం చంద్రబాబు గారి మాటలని... ఎడిట్ చేసి ముఖ్యమంత్రి రైతులను హెచ్చరించారు అనే విధంగా ఇంకో ఫేక్ వీడియోని క్రియేట్ చేసారు. ఒక ముఖ్యమంత్రి మీడియా ముఖంగా మాట్లాడిన మాటలనే ఇలా వక్రీకరించిన ఈ వైసీపీ విషసర్పాలను ఏం చేయాలి? ప్రజలారా ...ఇలాంటి ఫేక్ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండండి.` అంటూ లోకేష్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. అదేవిధంగా, ప్రెస్మీట్లో చంద్రబాబు ఒరిజినల్గా ఏం మాట్లాడారో తెలియజేస్తూ అసలైన వీడియోను కూడా పంచుకున్నారు.